సింధు పదో‘సారీ’ | Indian shuttler PV Sindhu loses again to An Se Young | Sakshi
Sakshi News home page

సింధు పదో‘సారీ’

Jun 5 2026 4:19 AM | Updated on Jun 5 2026 4:19 AM

Indian shuttler PV Sindhu loses again to An Se Young

ఆన్‌ సె యంగ్‌ చేతిలో మళ్లీ ఓడిన భారత షట్లర్‌  

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ పదో ర్యాంకర్, భారత స్టార్‌ పీవీ సింధు కథ ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 44 నిమిషాల్లో 17–21, 15–21తో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. ఆన్‌ సె యంగ్‌ చేతిలో సింధుకిది వరుసగా 10వ పరాజయం కావడం గమనార్హం. 

2019 డెన్మార్క్‌ ఓపెన్‌లో తొలిసారి ఆన్‌ సె యంగ్‌తో ఆడిన సింధు ఇప్పటి వరకు ఈ కొరియా క్రీడాకారిణిని ఒక్కసారి కూడా ఓడించలేదు. అంతేకాకుండా ఆన్‌ సె యంగ్‌పై సింధు 10 మ్యాచ్‌ల్లో ఒక్క గేమ్‌ మాత్రమే గెలిచింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆయుశ్‌ శెట్టి (భారత్‌) 21–16, 13–21, 14–21తో లీ చెయుక్‌ వైయువి (హాంకాంగ్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 13–21, 12–21తో థోమ్‌ గికెల్‌–డెల్‌ఫైన్‌ డెల్‌ర్యూ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో హరిహరన్‌–ఎంఆర్‌ అర్జున్‌ (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హరిహరన్‌–అర్జున్‌ జంట 16–21, 21–15, 21–19తో ఆరోన్‌ టాయ్‌–కాంగ్‌ ఖాయ్‌ జింగ్‌ (మలేసియా) జోడీపై గెలిచింది.  

Advertisement
 
Advertisement
Advertisement