జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి శుభారంభం చేయగా... గాయం కారణంగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ టోర్నీ నుంచి తప్పుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ ఆయుశ్ 8–21, 22–20, 21–15తో ప్రపంచ 15వ ర్యాంకర్ హాంగ్ యాంగ్ వెంగ్ (చైనా)పై గెలుపొందాడు.
మలేసియా జంటతో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ జోడీ 6–11తో ఉన్న దశలో... ఆంధ్ర షట్లర్ సాత్విక్ గాయపడ్డాడు. దీంతో ఈ ద్వయం పోటీ నుంచి తప్పుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ 17–21, 21–16, 19–21తో ఎన్గ్యూయెన్ (ఐర్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా 15–21, 14–21తో ప్రపంచ మాజీ నంబర్వన్ నవోమి ఒకుహరా (జపాన్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ జోడీ ప్రిక్వార్టర్స్కు చేరింది. తొలి రౌండ్లో రుత్విక–రోహన్ జంట 21–14, 21–14తో హు లింగ్ ఫాంగ్–యాంగ్ పో సున్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచింది.


