నేటి నుంచి ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
బరిలో భారత అగ్రశ్రేణి షట్లర్లు
ఇండోనేసియా ఓపెన్లో భారత షట్లర్లు ఐదుసార్లు విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్లో సైనా నెహా్వల్ అత్యధికంగా మూడుసార్లు (2009, 2010, 2012) చాంపియన్గా నిలిచింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ (2017లో), పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (2023లో) ఒక్కోసారి టైటిల్ సాధించారు.
జకార్తా: రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... ఆదివారం ముగిసిన సింగపూర్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. అదే జోరును జకార్తాలోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత జోడీ బరిలోకి దిగుతోంది.
బుధవారం జరిగే తొలి రౌండ్లో కాంగ్ ఖాయ్ జింగ్–ఆరోన్ తాయ్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తొలి రోజు మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్, భారత స్టార్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్... పురుషుల డబుల్స్లో హరిహరన్–అర్జున్ ద్వయం... మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీ... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట పోటీపడనున్నారు.
ఈ టోర్నీలో సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ బుసానన్ (థాయ్లాండ్)తో సింధు తలపడుతుంది. బుసానన్తో 22వ సారి ఆడనున్న సింధు 20 సార్లు గెలిచి, ఒకసారి ఓడిపోయింది. బుసానన్పై గెలిస్తే సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) ఎదురయ్యే అవకాశముంది. ఆన్ సె యంగ్తో ఇప్పటి వరకు ఆడిన తొమ్మిదిసార్లూ సింధు ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో సింధు ప్రస్థానం ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసే అవకాశముంది. ఇతర మ్యాచ్ల్లో యుషి తనాకా (జపాన్)తో శ్రీకాంత్; అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో లక్ష్య సేన్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్లో గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా)లతో తనీషా–ధ్రువ్... మహిళల డబుల్స్లో కుసుమ ఫెబ్రియానా–మెలీసా (ఇండోనేసియా)లతో గాయత్రి–ట్రెసా...అజ్రియాన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా)లతో హరిహరన్–అర్జున్ తలపడతారు.


