రోహిత్‌ శర్మ మాస్‌ డ్యాన్స్‌ | Rohit Sharma, Suryakumar Dance To Dhol In New Delhi After Champions Return Home | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ మాస్‌ డ్యాన్స్‌

Jul 4 2024 10:28 AM | Updated on Jul 4 2024 10:40 AM

Rohit Sharma, Suryakumar Dance To Dhol In New Delhi After Champions Return Home

టీ20 వరల్డ్‌కప్‌ విజయానంతరం ఇవాళ (జులై 3) ఉదయం భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు కేరింతలు, హర్షద్వానాలతో భారత క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. జయహో భారత్‌ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్‌ కాగానే అభిమానులు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. ఇందుకు ప్రతిగా రోహిత్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభిమానులకు అభివాదం చేశాడు. అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది.

హోటల్‌ ఎంట్రెన్స్‌లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ టీమిండియా క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోల్‌ వాయింపుకు రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌ మాస్‌ డ్యాన్స్‌ చేశారు. రోహిత్‌ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. హోటల్‌ యాజమాన్యం విశ్వ విజేతల కోసం ప్రత్యేక కేక్‌ను ఏర్పాటు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేక్‌ను కట్‌ చేశాడు. 

ఇదిలా ఉంటే, భారత క్రికెటర్లు ఐటీసీ మౌర్యలో కాసేపు సేదతీరి ప్రధాని మోదీని కలిసేందుకు వెళతారు. మోదీతో భేటి అనంతరం టీమిండియా ముంబైకు బయల్దేరుతుంది. అక్కడ భారత క్రికెటర్లు ఓపెన్‌ టాప్‌ బస్‌లో ర్యాలీగా వెళ్తారు. చివరిగా టీమిండియా వాంఖడే స్టేడియంకు చేరుకుంటుంది. అక్కడ బీసీసీఐ ఆథ్వర్యంలో భారత క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్‌.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్‌కప్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్‌ ట్రోఫీ) సాధించింది.
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement