భూటాన్ స్టార్ బ్యాటర్ రిత్షి చోడెన్ మహిళల క్రికెట్లో ‘టైమ్డ్ అవుట్’ అయిన తొలి ప్లేయర్గా గుర్తింపు పొందింది. ఏసీసీ ఉమెన్స్ ప్రీమియర్ కప్లో భాగంగా గురువారం నేపాల్తో జరిగిన టి20 మ్యాచ్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది.
క్రీజ్లోకి రావడానికి రిత్షి 90 సెకన్లకంటే ఎక్కువ సమయం తీసుకుంది. దాంతో నేపాల్ ఫీల్డర్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు సున్ మెంగ్, అంకిత గుహ ఆమెను అవుట్గా ప్రకటించారు. భూటాన్ ఇన్నింగ్స్ తొలి నిమిషంలోనే ఈ ఘటన జరిగింది. ఓపెనర్ ఎన్గవాంగ్ తొలి బంతికే బౌల్డ్ కాగా... ఆ సమయానికి సిద్ధంగా లేని రిత్షి మెల్లగా తన హెల్మెట్, గ్లవ్స్ చేతిలో పట్టుకొని మైదానంలోకి వచ్చింది అంపైర్ నిర్ణయం తర్వాత రిత్షి ఎలాంటి నిరసన తెలపకుండా మౌనంగా నిష్క్రమించింది.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (సీఏఎన్) తమ జట్టు తరఫున భూటాన్ క్రికెట్కు క్షమాపణ చెప్పింది. నేపాల్ టీమ్ క్రీడా స్ఫూర్తిగా వ్యవహరించలేదని, నిబంధనల ప్రకారం ‘టైమ్డ్ అవుట్’ సరైందే అయినా... నేపాల్ టీమ్ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించలేదంటూ తమ అసంతృప్తిని వెల్లడించింది. ఈ మ్యాచ్లో ముందుగా నేపాల్ 20 ఓవర్లలో 113 పరుగులు చేయగా, ఆ తర్వాత 20 ఓవర్లలో 8 వికెట్లకు 62 పరుగులే చేసిన భూటాన్ 51 పరుగులతో ఓడింది.


