సాక్షి, హైదరాబాద్: టర్కీష్ ఓపెన్ జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ భట్రాజు సాయి నచికేత్ మెరిశాడు. ఇస్తాంబుల్ లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సాయి నచికేత్ పురుషుల అండర్–19 సింగిల్స్ విభాగంలో చాంపియన్గా అవతరించాడు. ఫైనల్లో నచికేత్ 39 నిమిషాల్లో 21–11, 23–21తో టాప్ సీడ్ మెహెమెత్ కాన్ టొరెమిస్ (టరీ్క)పై గెలుపొందాడు.
సెమీఫైనల్లో నచికేత్ 27 నిమిషాల్లో 21–13, 21–19తో మూడో సీడ్ ఆమెర్ మొహమ్మద్ (సౌదీ అరేబియా)పై, క్వార్టర్ ఫైనల్లో 47 నిమిషాల్లో 21–18, 21–23, 21–9తో ఐదో సీడ్ అమీర్ అలీ అహ్మద్లూ (ఇరాన్)పై నెగ్గాడు. నాలుగో సీడ్గా బరిలోకి దిగిన నచికేత్కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో నచికేత్ 21–8, 21–9తో అహ్మెత్ అర్దా కాయా (టర్కీ)పై, మూడో రౌండ్లో 21–17, 21–13తో సలీహ్ మెర్ట్ కాలిమ్లి (టర్కీ)పై విజయం సాధించాడు.
రెండు వారాల వ్యవధిలో సాయి నచికేత్కిది రెండో సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. గతవారం అతను ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ టోర్నీలోనూ చాంపియన్గా నిలిచాడు. ‘అర్జున అవార్డు’ గ్రహీత, అంతర్జాతీయ మాజీ షట్లర్ చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నచికేత్ శిక్షణ తీసుకుంటున్నాడు. ‘వరుసగా రెండు అంతర్జాతీయ టోర్నీల్లో టైటిల్స్ సాధించడం అంత సులువు కాదు. నచిచేత్ విజయాలకు నేను గరి్వస్తున్నాను. అతనికిది ఆరంభం మాత్రమే. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధిస్తాడు’ అని నచికేత్ కోచ్ చేతన్ ఆనంద్ అన్నాడు.


