బస్సు ప్రమాదం.. 8 మంది మృతి, 33 మందికి గాయాలు | tourist bus crashes in western Turkiye | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదం.. 8 మంది మృతి, 33 మందికి గాయాలు

May 31 2026 3:36 PM | Updated on May 31 2026 3:50 PM

tourist bus crashes in western Turkiye

ఇస్తాంబుల్: పశ్చిమ తుర్కియేలో ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక బస్సు రహదారి పక్కన ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకోవడంతో  8 మంది ప్రాణాలు కోల్పోగా, 33 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియాను ఉటంకిస్తూ షిన్‌హువా వెల్లడించింది.

షిన్‌హువా తెలిపిన వివరాల ప్రకారం.. 38 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు తుర్కియేలోని ఇజ్మిర్ నగరం నుంచి మధ్యధరా సముద్ర తీరంలోని పర్యాటక నగరం అంతాల్యాకు వెళ్తుండగా, దేశంలోని డెనిజ్లీ ప్రావిన్స్‌లో డెనిజ్లీ-అయ్దిన్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

మృతుల్లో బస్సు డ్రైవర్‌తో పాటు 9 నెలల శిశువు కూడా ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని షిన్‌హువా తెలిపింది. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం.. దట్టమైన పొగమంచు, అధిక వేగం ప్రమాదానికి కారణాలై ఉండొచ్చని భావిస్తున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొందరికి తీవ్ర గాయాలు కావడంతో అవయవాల తొలగింపు శస్త్రచికిత్సలు అవసరం కావచ్చని పేర్కొన్నారు. పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement