
దేశవాళీ క్రికెట్లో భారత వెటరన్ బ్యాటర్, విదర్భ స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. నాగ్పూర్ వేదికగా కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో నాయర్ అద్బుతమైన సెంచరీతో కదం తొక్కాడు. విదర్బ సెకెండ్ ఇన్నింగ్స్లో 295 బంతులు ఎదుర్కొన్న కరుణ్.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో 5 సెంచరీలు చేసిన కరుణ్ నాయర్కు ఓవరాల్గా ఈ సీజన్లో ఇది 9వ శతకం కావడం విశేషం.
అతడు సెంచరీ ఫలితంగా విదర్భ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఆఖరి రోజు ఆటలో విదర్బ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 110.3 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యం 37 పరుగులతో కలుపుకొని విదర్భ ఓవరాల్గా 324 పరుగుల ముందంజలో ఉంది. ఇక తన సెంచరీపై నాలుగో రోజు అనంతరం కరుణ్ నాయర్ స్పందించాడు.
"మైదానంలో అడుగుపెడితే పరుగులు సాధించడమే నా పని. ప్రస్తుతం అదే చేస్తున్నా. భారత జట్టుకు తిరిగి ఎంపికవడం నా చేతిలో లేదు. దానిపై ఏం వ్యాఖ్యానించలేను. ఈ మ్యాచ్కు ముందు 8 శతకాలు చేశాను. జట్టు సహాయ సిబ్బందితో దీని గురించి మాట్లాడా. ఈ రోజు సెంచరీ చేస్తే తొమ్మిదో అంకే చూపుతానని చెప్పా. అది సాధ్యమైంది కాబట్టే అలా సంజ్ఞ చేశా. నేను క్రీజులో అడుగుపెట్టినప్పుడు జట్టు 7/2తో ఉంది. దీంతో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాలని ముందే అనుకున్నా.
కొన్ని కఠిన సవాళ్లు ఎదురైన సెంచరీ పూర్తిచేసుకొని అజేయంగా నిలవడం ఆనందంగా ఉంది. ఆదివారం కూడా ఇదే ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాం. తొలి ఇన్నింగ్స్లో రనౌట్ కావడం ఎంతో బాధించింది. లేకపోతే అప్పుడు కూడా శతకం సాధిస్తానని అనుకున్నా. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ ఓపిగ్గా ప్రయత్నించి పరుగులు రాబట్టా. నాకు ఇది నాలుగో రంజీ ట్రోఫీ ఫైనల్. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా" అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు.
చదవండి: IML 2025: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్