ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడేశారు?! | IPL 2026: Players Who Might Have Played Their Last Match | Sakshi
Sakshi News home page

ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడేశారు?!

Jun 1 2026 4:35 PM | Updated on Jun 1 2026 5:01 PM

IPL 2026: Players Who Might Have Played Their Last Match

ఐపీఎల్‌ పందొమ్మిదో సీజన్‌ ముగిసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్‌ నిలబెట్టుకుంది. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.

ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌తో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్‌ కెరీర్‌ చరమాంకానికి చేరినట్లు తెలుస్తోంది. అంచనాలు అందుకోలేక చతికిలపడిన కొందరు ప్లేయర్లను వదిలించుకునేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టాప్‌-5లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే!

కరుణ్‌ నాయర్‌
కరుణ్‌ నాయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్‌లో రాణిస్తాడనే ఉద్దేశంతో 34 ఏళ్ల ఈ వెటరన్‌ బ్యాటర్‌కు అవకాశం ఇచ్చింది. ఇక, ఐపీఎల్‌-2025లో కరుణ్‌ నాయర్‌ కాస్త ఫర్వాలేదనిపించాడు.

ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 198 పరుగులు చేయగలిగాడు. దీంతో ఈ ఏడాది కూడా ఫ్రాంఛైజీ అతడిని కొనసాగించింది. అయితే, ఐపీఎల్‌-2026లో రెండు ఇన్నింగ్స్‌ ఆడిన కరుణ్‌ కేవలం 18 పరుగులే చేశాడు. ఫీల్డింగ్‌లోనూ విఫలమయ్యాడు.

వచ్చే సీజన్‌ నాటికి కరుణ్‌ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో కరుణ్‌ నాయర్‌కు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఇక అతడికి కొత్త జట్టు దొరకడం కూడా కష్టమే!

టి.నటరాజన్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నెట్‌ బౌలర్‌గా వచ్చి.. ఐపీఎల్‌లో ఇటీవలి కాలంలో ప్రభావం చూపిన లెఫ్టార్మ్‌ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు టి.నటరాజన్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది అతడిని ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో రాణించినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించకలేకపోయాడు ఈ తమిళనాడు బౌలర్‌. పది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం ఐదు వికెట్లే తీశాడు. ఎకానమీ 11.18.

వరుసగా ఆరు మ్యాచ్‌లలో నటరాజన్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేక చతికిలపడ్డాడు. కాబట్టి ఢిల్లీ అతడిని వదిలివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

అన్రిచ్‌ నోర్జే
సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్‌ అన్నిచ్‌ నోర్జేను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. పదునైన పేస్‌ ఆయుధంతో రాణించగల నోర్జే.. అదే స్థాయిలో గాయాల బారిన పడటం ప్రతికూలంగా మారింది.

తాజా ఎడిషన్‌లో అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడగలిగాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. గతంలో కేకేఆర్‌ తరఫున కూడా కేవలం రెండు మ్యాచ్‌లే ఆడి వెళ్లిపోయాడు. దీంతో గాయాల బెడదతో బాధపడుతున్న నోర్జేకు ఫ్రాంఛైజీలు మళ్లీ అవకాశం ఇవ్వడం దాదాపుగా అసాధ్యమే అనిపిస్తోంది.

ట్రెంట్‌ బౌల్ట్‌
న్యూజిలాండ్‌ సీనియర్‌ పేసర్‌ ఫాస్ట్‌బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు ఐపీఎల్‌లోనూ ఘన చరిత్రే ఉంది. వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కివీస్‌ బౌలర్‌.. ఇప్పటికి 124 మ్యాచ్‌లలో కలిపి 145 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఐపీఎల్‌-2026కు ముందు ముంబై ఇండియన్స్‌ రూ. 12.50 కోట్ల భారీ ధరకు బౌల్ట్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఆశించిన రీతిలో అతడు రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు. 

దీంతో అతడికి బౌలింగ్‌ కోటా పూర్తి చేసే  అవకాశం కూడా రాలేదు. కాబట్టి 36 ఏళ్ల బౌల్ట్‌ను ముంబై వదిలేస్తే.. అతడికి మరో ఫ్రాంఛైజీ నుంచి అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది.

హర్షల్‌ పటేల్‌
ఐపీఎల్‌-2026కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హర్షల్‌ పటేల్‌ను రూ. 8 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. గతేడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 16 వికెట్లు తీశాడు అయితే, గతంలో మాదిరి ఈసారి హర్షల్‌ రాణించలేదు.

ఐదు మ్యాచ్‌లు ఆడి 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. వచ్చే సీజన్‌ నాటికి హర్షల్‌ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఈ పరిణామాల క్రమంలో సన్‌రైజర్స్‌ అతడిని వదిలివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హర్షల్‌ వేలంలోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఫ్రాంఛైజీ అతడి వైపు మొగ్గుచూపకపోవచ్చు.

చదవండి: IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్‌మనీ?

Advertisement
 
Advertisement
Advertisement