
ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్ టోర్నీలో ఇండియా మాస్టర్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం వడోదర వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 13.5 ఓవర్లలో కేవలం 85 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్లలో స్పిన్నర్ రాహుల్ శర్మ, దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటారు. రాహుల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇవ్వగా.. యువీ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు ఇచ్చాడు. వీరిద్దరితో పాటు నేగీ, బిన్నీ తలా రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రీ డేవిడ్స్(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు
రాయుడు ఆజేయంగా..
అనంతరం 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 11 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అంబటి రాయుడు(34 బంతుల్లో 7 ఫోర్లతో 41) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు పవన్ నేగి(21 నాటౌట్) రాణించాడు.
అయితే భారత కెప్టెన్ సచిన్ టెండూల్కర్ మాత్రం ఈ మ్యాచ్లో తన మార్క్ను చూపించలేకపోయాడు. సచిన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మూడు వికెట్లతో సత్తాచాటిన రాహుల్ శర్మకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో మార్చి 5న వడోదర వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.
చదవండి: Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..