
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఖరి లీగ్ మ్యాచ్ సమరానికి సిద్దమైంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకున్న ఇరు జట్లు లీగ్ స్టేజిని విజయంతో ముగించాలని భావిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్తో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు.
కాగా ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా, ఓవరాల్గా 22వ ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేరిట ఎన్నో అద్భుతమైన రికార్డులను లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు భారత జట్టు తరపున 299 వన్డేలు ఆడిన కోహ్లి.. 58.20 సగటుతో 14,085 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి.
300 కంటే ఎక్కువ వన్డేలు ఆడిన భారత ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ – 463 మ్యాచ్లు
ఎంఎస్ ధోని – 350 మ్యాచ్లు
రాహుల్ ద్రవిడ్ – 344 మ్యాచ్లు
మహమ్మద్ అజారుద్దీన్ – 334 మ్యాచ్లు
సౌరవ్ గంగూలీ – 311 మ్యాచ్లు
యువరాజ్ సింగ్ – 304 మ్యాచ్లు
వరల్డ్ రికార్డుపై కన్ను..
అదేవిధంగా ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో 300 వన్డేలు, 100 టెస్టులు, 100 టీ20లు ఆడిన తొలి క్రికెటర్గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించనున్నాడు. విరాట్ ఇప్పటివరకు 299 వన్డేలు, 123 టెస్టులు, 125 టీ20లు ఆడాడు.
సంగర్కరకు చేరువలో కోహ్లి..
కాగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కింగ్ కోహ్లి మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి మరో 149 పరుగులు చేస్తే శ్రీలంక కుమార్ సంగక్కర(14234)ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో 463 మ్యాచ్లు ఆడి 18426 పరుగులు చేశాడు. సచిన్ కంటే కోహ్లి ఇంకా 4,341 పరుగులు వెనకబడి ఉన్నాడు.
చదవండి: Champions Trophy: టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్లోనే?