PC: BCCI/X.com
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ను 6 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో ఆతిథ్య జట్టు 80 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో సీనియర్ బ్యాటర్ జో రూట్ (76 పరుగులు, 76 బంతుల్లో), లియామ్ డాసన్ (68 పరుగులు, 83 బంతుల్లో) బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశాడు. అక్షర్ 62 పరుగులు ఇచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలా రెండు వికెట్లు చొప్పున సాధించారు.
అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 45.2 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(85) టాప్ స్కోరర్గా నిలిచాడు. నిలకడగా ఆడిన గిల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. గిల్తో పాటు అక్షర్ పటేల్(55 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, టంగ్, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూలై 16న కార్డిప్ వేదికగా జరగనుంది.


