
ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడిగా ఘనత
న్యూఢిల్లీ: భారత సీనియర్ షూటర్ రణ్దీర్ సింగ్ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన 44వ ఓసీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడిగా రణ్«దీర్ సింగ్ నిలిచారు. 2028 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐదు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 77 ఏళ్ల రణ్«దీర్ సింగ్ గతంలో కొన్నాళ్ల పాటు ఓసీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఆసియాలోని 45 దేశాల ప్రతినిధుల్లో 44 మంది రణ్దీర్కు మద్దతిచ్చారు. రణ్«దీర్ సింగ్ 2001 నుంచి 2014 వరకు ఐఓసీలో సభ్యుడిగా వ్యవహరించారు. ‘ఓసీఏ జనరల్ అసెంబ్లీ సమావేశం భారత్లో జరగడం సంతోషాన్నిచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతోంది. మౌలిక సదుపాయాల కల్పన బాగుండటం వల్లే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి’ అని రణ్దీర్ పేర్కొన్నారు.