
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్లో భాగంగా టెక్సాస్ కింగ్స్తో ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడం ఆటగాడు, పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలుత బౌలింగ్లో (3-0-33-3) రెచ్చిపోయిన ఓవెన్.. ఆతర్వాత బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించాడు (52 బంతుల్లో 89; 8 ఫోర్లు, 5 సిక్సర్లు). ఫలితంగా ఓవెన్ ప్రాతినిథ్యం వహించిన వాషింగ్టన్ ఫ్రీడం మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అతి భారీ లక్ష్య ఛేదనను (223/3) నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో ఓవెన్ ఆండ్రియస్ గౌస్తో (45 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్కు 121 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఓవెన్, గౌస్ కలిసి వాషింగ్టన్ ఫ్రీడంకు చారిత్రక విజయాన్ని అందించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్ (31 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో స్టోయినిస్ (32), మిలింద్ కుమార్ (31), షుభమ్ రంజనే (26 నాటౌట్), స్మిత్ పటేల్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సాయితేజ ముక్కామల (6), డొనోవన్ ఫెరియెరా (9) విఫలమయ్యారు. వాషింగ్టన్ బౌలర్లలో మిచెల్ ఓవెన్ 3, మ్యాక్స్వెల్ 2, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్.. ఓవెన్, గౌస్ చెలరేగిపోవడంతో 19.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 11, మ్యాక్స్వెల్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. గౌస్తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ (4 బంతుల్లో 12 నాటౌట్) వాషింగ్టన్ను విజయతీరాలకు చేర్చాడు. వాషింగ్టన్ కోల్పోయిన మూడు వికెట్లు ఆడమ్ మిల్నే ఖాతాలో పడ్డాయి.
ఈ మ్యాచ్కు ముందు ఎంఎల్సీలో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు నికోలస్ పూరన్ నేతృత్వంలోని ఎంఐ న్యూయార్క్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో ఆ జట్టు సియాటిల్ ఓర్కాస్పై 201 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది (7 వికెట్లు కోల్పోయి). ఈ మ్యాచ్కు ముందు వరకు ఎంఎల్సీలో ఇదే భారీ లక్ష్య ఛేదనగా ఉండింది.