
172 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో ఛేదించిన పంజాబ్ కింగ్స్
లక్నో సూపర్ జెయింట్స్పై 8 వికెట్లతో ఘనవిజయం
ప్రభ్సిమ్రన్ సింగ్ మెరుపులు
రాణించిన అర్ష్ దీప్ , శ్రేయస్ అయ్యర్
లక్నో: కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో ఐపీఎల్ 18వ సీజన్లో అడుగు పెట్టిన పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించి గెలిచింది. 171 వద్ద స్కోరు సమమైనపుడు లక్నో బౌలర్ అబ్దుల్ సమద్ వేసిన బంతిని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) సిక్స్గా మలిచి పంజాబ్ కింగ్స్ను విజయతీరానికి చేర్చాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రభ్సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69; 9 ఫోర్లు, 3 సిక్స్లు) లక్నో బౌలర్ల భరతం పట్టి మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. ప్రభ్సిమ్రన్ అవుటయ్యాక వచ్చిన నేహల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు సాధించింది.
అర్ష్ దీప్ సింగ్ (3/43) మూడు కీలక వికెట్టు పడగొట్టగా... మ్యాక్స్వెల్, ఫెర్గూసన్, యాన్సెన్, చహల్లకు ఒక్కో వికెట్ దక్కింది. లక్నో జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో టాప్–3 బ్యాటర్లను కోల్పోయింది. మిచెల్ మార్ష్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా... పంత్ 2 పరుగులతో నిరాశపరిచాడు. క్రీజులో నిలదొక్కుకున్న దశలో మార్క్రమ్ను ఫెర్గూసన్ బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత పూరన్ (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్లు), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్స్లు) ఆటతో లక్నో స్కోరు 100 దాటింది. చివర్లో సమద్ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించడంతో లక్నో జట్టు ప్రత్యర్థి కి గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్లో ఆరంభంలోనే ఆర్య వికెట్ కోల్పోయినా పంజాబ్ వెనక్కి తగ్గలేదు. లక్నో బౌలర్లపై ప్రభ్సిమ్రన్, అయ్యర్ ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగెత్తించారు. ముఖ్యంగా ప్రభ్సిమ్రన్ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు.
శార్దుల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 4,6 కొట్టిన ప్రభ్సిమ్రన్... రవి బిష్ణోయ్ వేసిన ఆరో ఓవర్లో 4,4,6తో మెరిశాడు. అదే జోరులో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్లో 11వ ఓవర్ తొలి బంతికి ప్రభ్సిమ్రన్ ఇన్నింగ్స్కు తెరపడింది. దిగ్వేశ్ వేసిన బంతిని డీప్ మిడ్వికెట్ వైపు ప్రభ్సిమ్రన్ షాట్ ఆడగా... ఆయుశ్ బదోని క్యాచ్ తీసుకొని బౌండరీ లైను వద్ద బ్యాలెన్స్ కోల్పోయి బంతిని గాల్లోకి విసిరాడు.
డీప్ స్క్వేర్ లెగ్ వద్ద నుంచి వచ్చిన రవి బిష్ణోయ్ గాల్లో ఉన్న బంతిని పట్టుకోవడంతో ప్రభ్సిమ్రన్ పెవిలియన్ చేరుకున్నాడు. ప్రభ్సిమ్రన్ వెనుదిరిగాక వచ్చిన నేహల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ 17వ ఓవర్లోనే విజయాన్ని అందుకుంది.

స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) ఫెర్గూసన్ 28; మిచెల్ మార్ష్ (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ సింగ్ 0; నికోలస్ పూరన్ (సి) మ్యాక్స్వెల్ (బి) చహల్ 44; రిషభ్ పంత్ (సి) చహల్ (బి) మ్యాక్స్వెల్ 2; ఆయుశ్ బదోని (సి) మ్యాక్స్వెల్ (బి) అర్ష్ దీప్ సింగ్ 41; డేవిడ్ మిల్లర్ (సి) ప్రభ్సిమ్రన్ సింగ్ (బి) యాన్సెన్ 19; అబ్దుల్ సమద్ (సి) ఆర్య (బి) అర్ష్ దీప్ సింగ్ 27; శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 3; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–35, 4–89, 5–119, 6–166, 7–167. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–43–3, ఫెర్గూసన్ 3–0–26–1, మ్యాక్స్వెల్ 3–0–22–1, మార్కో యాన్సెన్ 4–0–28–1, స్టొయినిస్ 2–0–15–0, యుజువేంద్ర చహల్ 4–0–36–1.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) శార్దుల్ ఠాకూర్ (బి) దిగ్వేశ్ రాఠి 8; ప్రభ్సిమ్రన్ సింగ్ (సి) రవి బిష్ణోయ్ (బి) దిగ్వేశ్ రాఠి 69; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 52; నేహల్ వధేరా (నాటౌట్) 43; ఎక్స్ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–26, 2–110. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 3–0–39–0, అవేశ్ ఖాన్ 3–0–30–0, దిగ్వేశ్ రాఠి 4–0–30–2, రవి బిష్ణోయ్ 3–0–43–0, మణిమారన్ సిద్ధార్థ్ 3–0–28–0, అబ్దుల్ సమద్ 0.2–0–6–0.
ఐపీఎల్లో నేడు
బెంగళూరు X గుజరాత్
వేదిక: బెంగళూరు
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం