Operation Sindoor: పాక్‌ క్రికెట్‌ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ! | PSL 2025: England Players Wish To Leave Amid Operation Sindoor: Report | Sakshi
Sakshi News home page

Operation Sindoor: పాక్‌ క్రికెట్‌ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!

May 8 2025 1:01 PM | Updated on May 8 2025 1:25 PM

PSL 2025: England Players Wish To Leave Amid Operation Sindoor: Report

డేవిడ్‌ విల్లే- క్రిస్‌ జోర్డాన్‌

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) నిర్వాహకులకు మరో భారీ ఎదురుదెబ్బ! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)తో పోటీ పడుతూ.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు సమాంతరంగా పీఎస్‌ఎల్‌ నిర్వహిస్తూ పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇ‍ప్పటికే చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌కు ఎప్పటిలాగే ప్రేక్షకుల నుంచి అమితాదరణ లభిస్తుండగా.. పీఎస్‌ఎల్‌ను చూసే వాళ్లే కరువయ్యారు. ఇక పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌ దాయాదిపై తీసుకున్న చర్యల్లో కఠిన చర్యల్లో భాగంగా.. పీఎస్‌ఎల్‌ ప్రసారాలను ఇక్కడ నిలిపివేశారు. దీంతో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అయింది.

ఏడుగురు ఆటగాళ్లు స్వదేశానికి?
తాజాగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. విదేశీ ఆటగాళ్లు ఈ లీగ్‌ నుంచి నిష్క్రమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌కు చెందిన ఏడుగురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.  

సామ్‌ బిల్లింగ్స్‌, జేమ్స్‌ విన్స్‌, టామ్‌ కరన్‌, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ జోర్డాన్‌ వంటి స్టార్‌ ప్లేయర్లతో పాటు టామ్‌ కొలర్‌-కాన్మోర్‌, ల్యూక్‌ వుడ్‌ కూడా పీఎస్‌ఎల్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వెళ్లిపోతాం
వీరిలో ముల్తాన్‌ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డేవిడ్‌ విల్లే, క్రిస్‌ జోర్డాన్‌ ఇప్పటికే తమ నిర్ణయం గురించి ఫ్రాంఛైజీ యాజమాన్యానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఎలాగూ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించడం.. అదే విధంగా.. తమకు ఇంకా ఒక్క మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉండటంతో ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోతామని చెప్పినట్లు సమాచారం.

మరోవైపు.. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు, ప్రొఫెషనల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పాక్‌లో ఉన్న తమ ఆటగాళ్ల బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

సంతృప్తిగానే ఉన్నారు!
ఇక ఈ పరిణామాల గురించి పీఎస్‌ఎల్‌ విదేశీ ఆటగాళ్ల వ్యవహారాల ఏజెంట్‌ స్పందిస్తూ.. ‘‘భద్రత పరంగా మేము చేసిన ఏర్పాట్లపై మెజారిటీ మంది సంతృప్తిగానే ఉన్నారు. అయితే, మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. 

ఇప్పటికైతే ఆటగాళ్లను పాక్‌ను వీడరనే అనుకుంటున్నా’’ అని ది టెలిగ్రాఫ్‌తో పేర్కొన్నారు. అదే విధంగా పీసీబీ వర్గాలు స్పందిస్తూ.. ఇప్పట్లో ఎవరూ పాక్‌ను వీడరని.. లీగ్‌ పూర్తైన తర్వాతే వెళ్తారని పేర్కొన్నాయి.

కాగా జమ్మూకశ్మీర్‌లోని ప్రశాంతమైన బైసరన్‌ లోయలో గత నెలలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. లోయ అందాలను ఆస్వాదించేందుకు వచ్చి సరాదాగా గడుపుతున్న 26 మంది అమాయకులను కాల్చి చంపేశారు. 

ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు ముచ్చెమటలు
ఇందుకు ప్రతిగా భారత్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న తొమ్మిది స్థావరాలను పేల్చి వేసింది. 

దీంతో బాధితులకు న్యాయం జరిగిందంటూ యావత్‌ భారతావని సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్నట్లుగా కనిపిస్తున్న ఫొటోలతో పాక్‌ సైనికాధికారులు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు.

ఇదిలా ఉంటే.. మార్చి 22న మొదలైన ఐపీఎల్‌-2025 ఎడిషన్‌ మే 25న ఫైనల్‌తో ముగుస్తుంది. అయితే, ఎప్పుడూ ఇండియన్‌ లీగ్‌తో పోటీకి రాని పాక్‌ బోర్డు.. ఈసారి మాత్రం క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను ఢీకొట్టింది. ఏప్రిల్‌ 11 నుంచి మే 18 వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు కొంత మంది ప్లేయర్లు ఇప్పటికే పీఎస్‌ఎల్‌ను వీడగా.. తాజాగా మరికొంత మంది స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement