ఉగ్ర మూకలను స్థావరాల్లోనే మట్టుబెడతాం | Defence Minister Rajnath Singh says India zero tolerance against terrorism | Sakshi
Sakshi News home page

ఉగ్ర మూకలను స్థావరాల్లోనే మట్టుబెడతాం

Jul 19 2026 4:38 AM | Updated on Jul 19 2026 4:38 AM

Defence Minister Rajnath Singh says India zero tolerance against terrorism

ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్‌’ఆచరణలో చూపాం

‘ఆపరేషన్‌ సింధూర్‌’తో మన సత్తా రుజువైంది

ఈ ఏడాది రక్షణ ఉత్పత్తుల లక్ష్యం రూ.2 లక్షల కోట్లు

2029 నాటికి రూ.50 వేల కోట్లకు రక్షణ ఎగుమతులు

వెల్లడించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత్‌ అనుసరి స్తున్న జీరో టాలరెన్స్‌ విధానం మాటలకే పరిమితం కాలేదని చేతల్లోనూ చూపామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఉగ్ర కేంద్రాలపై దాడులతోనే సరిపెట్టకుండా, వారి స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ముష్కరులను అంతం చేస్తామన్నారు. దేశీయ ఆయుధాలతో చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ద్వారా ఉగ్ర స్థావరాల్లోకి చొరబడి మరీ మట్టుబెట్టగల సత్తాను ప్రపంచానికి నిరూపించామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

 రక్షణ రంగంలో గడచిన పన్నెండేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నా యని ఆయన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని లేశమాత్రమైనా సహించేది లేదని రాజ్‌నాథ్‌ తేల్చిచెప్పారు. దేశీయంగా అభివద్ధి చేసిన ఆకాశ్‌తీర్, ఆకాశ్, బ్రహ్మోస్‌ క్షిపణులను ఆపరేషన్‌ సింధూర్‌లో అత్యంత సమర్థవంతంగా వినియోగించామని, ఆధునిక సాంకేతిక యుద్ధానికి ఇది చక్కటి ఉదాహరణ అని వివరించారు.

రూ.70 వేల కోట్లతో డిఫెన్స్‌ కారిడార్లు..
స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈల నుంచి రూ.2,400 కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరికొత్త సాంకేతికతల అభివృద్ధికి రూ.1,500 కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇన్నోవేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా 676 స్టార్టప్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోగా, ఇప్పటివరకు 551 ఒప్పందాలు పూర్తయ్యాయి. యూపీ, తమిళనాడు డిఫెన్స్‌ కారిడార్లలో ప్రతిపాదించిన రూ.70 వేల కోట్ల పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.10 వేల కోట్లు వాస్తవరూపం దాల్చా యని మంత్రి వివరించారు.

2029 నాటికి రూ.50 వేల కోట్ల ఎగుమతులు.. 
2013–14 కాలంలో భారత్‌ రక్షణ ఎగుమతులు కేవలం రూ.686 కోట్లు మాత్రమే కాగా, 2025–26 నాటికి రూ.38 వేల కోట్లకు పెరిగాయని మంత్రి రాజ్‌నాథ్‌ చెప్పారు. 2029 కల్లా రక్షణ ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేర్చనున్నట్లు చెప్పారు. అదేవిధంగా, ఈ ఏడాది రక్షణ ఉత్పత్తుల విలువను రూ.2 లక్షల కోట్లకు, 2029 నాటికి రూ.3 లక్షల కోట్లకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. మన ఉత్పత్తులు సుమారుగా 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని వివరించారు. 

మన వ్యూహాత్మక అడుగులు ఇప్పుడు హిందూ మహాసముద్ర ప్రాంతానికే పరిమితం కాలేదని, ఇండో–పసిఫిక్‌కు కూడా విస్తరించాయని ఆయన వివరించారు. రక్షణ దౌత్యంలో భాగంగా ఇండోనేసియాతో బ్రహ్మోస్‌ ఒప్పందం, ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరా, న్యూజిలాండ్‌తో వాణిజ్యం రెట్టింపు కావడం తదితర పరిణామాలతో ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ వ్యూహాత్మక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరాయన్నారు. 2047 నాటికి భారత్‌ను స్వయం సమద్ధి సాధించిన అత్యుత్తమ రక్షణ శక్తిగా నిలపడమే లక్ష్యమని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement