దేవెగౌడతో చెన్నమ్మ(ఫైల్ ఫోటో)
భారత మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడ సతీమణి, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి తల్లి చెన్నమ్మ (89) కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం తుది శ్వాసవిడిచారు. ఆమె మరణసమయంలో దేవెగౌడ, కుమారస్వామి సహా కుటుంబ సభ్యులంతా హాస్పటిల్లోనే ఉన్నారు.
చెన్నమ్మ గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో బుధవారం ఆమెను మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. గత మూడు రోజులగా చికత్స పొందుతున్న చెన్నమ్మకు శనివారం తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటలో తెలిపాయి.
చెన్నమ్మ భౌతికకాయాన్ని బెంగళూరులోని పద్మనాభనగర్లోని వారి నివాసానికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం సోమవారం హాసన్ జిల్లాలోని వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చెన్నమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమెను ఒక మాతృమూర్తిగా అభివర్ణించారు.
కాగా 1954లో దేవెగౌడతో చెన్నమ్మ వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కుమారస్వామి కేంద్ర మంత్రి కాగా, హెచ్.డి. రేవణ్ణ హాసన్ జిల్లా హోలెనరసిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.


