
అత్యాచారం కేసులో శిక్ష ఖరారు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ కీలక నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్కు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు.
పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్హౌస్లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్ను అరెస్ట్చేయడం తెల్సిందే.
కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే ఉన్న దోషి ప్రజ్వల్ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ విద్యారి్థని. పార్లమెంట్ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి.
బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్ïÙట్ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎన్ జగదీశ చెప్పారు.
బాధితురాలికి హ్యాట్సాఫ్: సీఐడీ చీఫ్ వ్యాఖ్య
బనశంకరి: ఈ కేసులో ఎన్ని బెదిరింపులు ఎదురైనా బాధితురాలు ధైర్యంగా ఎదుర్కొన్నారని సీఐడీ అదనపు డీజీపీ బిజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘కేసు నమోదైన 16 నెలల్లో తీర్పు రావడం నిజంగా ప్రత్యేకం. లైంగిక వేధింపుల వీడియోలో ఉన్నది ప్రజ్వల్ అని కోర్టుకు నిరూపించడానికి సిట్ ఎంతో శ్రమించింది. నేర నిరూపణకు బాధితురాలి ధైర్యమే కారణం. ఆమెకు ఈ విషయంలో సీఐడీ నిజంగా ధన్యవాదాలు తెలుపుతోంది. ఈమె నిరుపేద కావడంతో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాబల్యం కలిగిన వ్యక్తి కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు’’అని బిజయ్ అన్నారు.

ఎప్పుడేం జరిగిందంటే?
→ 2024 ఏప్రిల్ 22: ప్రజ్వల్ రేప్ వీడియోలు వైరల్
→ ఏప్రిల్ 25 : అశ్లీల వీడియోలపై దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి లేఖ
→ ఏప్రిల్ 26–27: జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్
→ ఏప్రిల్ 28 : ప్రజ్వల్పై ఎఫ్ఐఆర్ నమోదు
→ ఏప్రిల్ 28 : అశ్లీల దృశ్యాలు కలిగిన పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
→ ఏప్రిల్ 30: జేడీఎస్ పార్టీ నుంచి ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తూ జేడీఎస్ నిర్ణయం
→ మే 1 : ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు
→ మే 30: బెంగళూరు ఎయిర్పోర్ట్లో
ప్రజ్వల్ అరెస్టు
→ సెప్టెంబర్ 9 : 113 సాక్షులతో కూడిన 1,632 పేజీల రెండో చార్జ్ïÙట్ దాఖలు
→ నవంబర్ 11 : ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
→ 2025 జూలై 18 : విచారణ పూర్తి చేసి జూలై 30న తీర్పు వెలువరిస్తామని చెప్పిన కోర్టు
→ జూలై 30: ఆగస్టు 1కి తీర్పు వాయిదా
→ ఆగస్టు 1: ప్రజ్వల్ను దోషిగా తేలి్చన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం
→ ఆగస్టు 2: ప్రజ్వల్కు జీవిత ఖైదు విధింపు