సోషల్ మీడియా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి
న్యాయ కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు
విద్యార్థులు, ఇంటర్న్ల ప్రత్యేక అఫిడవిట్, అండర్టేకింగ్ తప్పనిసరి
ఉల్లంఘిస్తే ఇంటర్న్షిప్ రద్దు, చట్టపరమైన చర్యలంటూ హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ప్రాంగణాలు, కేసుల విచారణలు, న్యాయవాదుల కార్యాలయా లు, ఇంటర్న్షిప్లు, క్లయింట్ల వివరాలకు సంబంధించిన వీడియోలు, రీల్స్, సోషల్ మీడియా పోస్టులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కఠిన ఆంక్షలు విధించింది. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ఇంటర్న్లు సోషల్ మీడియాలో పాటించాల్సిన నైతిక ప్రమాణాలు, వృత్తి గోప్యత, కోర్టు మర్యాదలకు సంబంధించిన కొత్త మార్గదర్శ కాలను జారీ చేసింది.
వీటిని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు, న్యాయ విద్యా సంస్థలు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బీసీఐ జారీ చేసిన సర్క్యులర్ ను సాధారణ సూచనగా కాకుండా తప్పని సరిగా అమలు చేయాల్సిన ఆదేశంగా పరిగణించాలని పేర్కొంది. సర్క్యులర్ను కేవలం వెబ్సైట్లో ఉంచడం లేదా వాట్సాప్లో పంపించడం సరిపోదని, విద్యార్థులు, న్యాయవాదుల్లో దీనిపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఇవి అందరికీ వర్తిస్తాయి
‘సోషల్ మీడియాలో న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ఇంటర్న్ల వృత్తి గౌరవం, నైతికతను కాపాడడం’పేరుతో విడుదల చేసిన ఈ సర్క్యులర్లో కోర్టు ప్రాంగణాలు, కోర్టు కారిడార్లు, న్యాయమూర్తుల విచారణలు, లైవ్స్ట్రీమ్ విచారణల క్లిప్పింగులు, చాంబర్లు, ఇంటర్న్షిప్లు, కేసుల నిర్వహణకు సంబంధించిన రీల్స్, వీడియోలు, షార్ట్ క్లిప్స్, మీమ్స్, థంబ్నెయిల్స్, ప్రచార పోస్టులు రూపొందించడం, ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మార్గదర్శకాలు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, పరిశోధన విద్యార్థులు, ఇంటర్న్లు సహా న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారందరికీ వర్తిస్తాయని బీసీఐ పేర్కొంది.
ఆ వీడియోలపై నిషేధం
ఇంటర్న్షిప్ సమయంలో చాంబర్లో జరిగే చర్చలు, కేసు ఫైళ్లు, క్లయింట్ సమావేశాలు, న్యాయ వ్యూహాలు, డ్రాఫ్టింగ్, పరిశోధన, కోర్టు సందర్శనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వృత్తి గోప్యతకు విరుద్ధమని బీసీఐ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ‘డే ఇన్ కోర్ట్‘, ‘డే ఇన్ చాంబర్‘, ‘ఇంటర్న్షిప్ రివీల్‘, ‘కేస్ ఫైల్‘, ‘కోర్ట్ రూమ్ డ్రామా‘, ‘లాయర్ లైఫ్‘వంటి శీర్షికలతో వీడియోలు, రీల్స్ రూపొందించడం నిషేధిత చర్యలుగా పేర్కొంది.
కోర్టు విచారణలను రికార్డు చేయడం, క్లయింట్ల వివరాలు, కేసు వ్యూహాలు, డ్రాఫ్టులు, పిటిషన్లు, అంతర్గత చర్చలను బహిర్గతం చేయడాన్ని కూడా పూర్తిగా నిషేధించింది. ఇంటర్న్షిప్ అనేది క్రమశిక్షణ, వినయం, న్యాయ పరిశోధన, డ్రాఫ్టింగ్, కోర్టు విధా నాల అవగాహన, వృత్తి నైతికత, బాధ్యత లను నేర్చుకోవడానికి మాత్రమేనని, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకో వడానికి లేదా వ్యక్తిగత ప్రచారం కోసం కాదని విద్యార్థులకు స్పష్టంగా తెలియ జేయాలని బీసీఐ సూచించింది.
హామీ తప్పనిసరి
ఇకపై న్యాయ విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ప్రత్యేక అండర్టేకింగ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ ప్రారంభానికి ముందు మరో ప్రత్యేక అఫిడవిట్ ఇవ్వడం కూడా బీసీఐ తప్ప నిసరిగా చేసింది. ఈ అండర్టేకింగ్ను సాధార ణ అడ్మిషన్ ఫారంలో భాగంగా కాకుండా విడిగా తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అలాగే అన్ని న్యాయ కాలేజీలు, విశ్వవిద్యాల యాలు ఈ మార్గదర్శకాలపై అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలని కోరింది.
అధ్యాపకు లు, విద్యార్థులకు సర్క్యులర్ను వివరించాలని, అమలు పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై ఇంటర్న్షిప్ రద్దు, సంబంధిత ‘లా’ కాలేజీలకు సమాచారం ఇవ్వడం, ఇంటర్న్షిప్ కోఆర్డినేట ర్లు, బార్ అసోసియేషన్లు, లా ఫర్మ్లకు ఫిర్యాదు చేయడం, అడ్మిషన్ లేదా ఎన్రోల్మెంట్ కమిటీల ముందు కేసులు ఉంచడం, కౌన్సెలింగ్, హెచ్చరికలు, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని బీసీఐ హెచ్చరించింది.


