పాకిస్తాన్ క్రికెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంగ్లండ్తో మూడో టెస్టుకు ముందు ఉన్నపళంగా జట్టులోని ఏడుగురు ఆటగాళ్లను, ఇద్దరు కోచ్లను తొలగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు .. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్బాస్టన్ టెస్టుకు ముందు పీసీబీ తమ జట్టు సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మూడో టెస్టు ముగిసే వరకు ఆ మొబైల్ ఫోన్లు పీసీబీ వద్దే ఉంటాయని పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ చర్యకు గల కారణం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ విషయంపై పీసీబీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రొఫెషనల్ క్రికెట్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా వాడకూడదని చెప్పే హక్కు బోర్డుకు లేదు. సాధారణంగా ఆటగాళ్లు స్టేడియానికి వచ్చేటప్పుడు తమ ఫోన్లను సంబంధిత అధికారులకు అందజేస్తారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత వాటిని తిరిగి తీసుకుంటారు. కానీ పీసీబీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూసింది. దీంతో మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా వంటి స్టార్ ప్లేయర్లతో సహా ఏడుగురిని పీసీబీ స్వదేశానికి తిరిగి పిలిపించింది. వీరితో పాటు కోచ్లు సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్లపై కూడా బోర్డు వేటు వేసింది. పీసీబీ తీసుకున్న ఈ హఠాత్తు నిర్ణయాలపై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగానే, జట్టు సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకుంటూ పీసీబీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్


