మరీ స్కూల్‌ పిల్లల్లా ఆడారు: పాక్‌ మాజీ బ్యాటర్‌ విమర్శలు.. ఫ్యాన్స్‌ ఫైర్‌ | Paper Tigers Pakistan Cricketer Dig At Rohit Co After NZ Test Series Loss | Sakshi
Sakshi News home page

మరీ స్కూల్‌ పిల్లల్లా ఆడారు: పాక్‌ మాజీ బ్యాటర్‌ విమర్శలు.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Oct 28 2024 6:59 PM | Updated on Oct 28 2024 7:23 PM

Paper Tigers Pakistan Cricketer Dig At Rohit Co After NZ Test Series Loss

భారత క్రికెట్‌ జట్టును ఉద్దేశించి పాకిస్తాన్‌ మాజీ బ్యాటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రోహిత్‌ సేన మరీ స్కూల్‌ పిల్లల్లా ఆడిందని.. వీరిని ‘పేపర్‌ టైగర్స్‌’ అనాలంటూ విమర్శించాడు. అయితే, టీమిండియా అభిమానులు సైతం.. ‘‘మా జట్టు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ షెహజాద్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.  

కాగా భారత్‌ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 46 పరుగుల(తొలి ఇన్నింగ్స్‌)కే ఆలౌట్‌ అయిన రోహిత్‌ సేన.. ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 

అనంతరం పుణె వేదికగా రెండో టెస్టులోనూ 113 రన్స్‌ తేడాతో ఓడిపోయింది. ఫలితంగా 0-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌లో ఓడిపోయింది.

ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. పాక్‌ మాజీ బ్యాటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ సైతం స్పందించాడు. భారత జట్టుపై న్యూజిలాండ్‌ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిందని పేర్కొన్నాడు. రోహిత్‌ సేన పేపర్‌పై మాత్రమే పటిష్టంగా కనిపిస్తుందని.. మైదానంలో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడటం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగా
ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌లో.. ‘‘న్యూజిలాండ్‌ ఇండియాకు వచ్చి టీమిండియానే ఈ స్థాయిలో ఓడించింది. ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగా సునాయాస విజయం సాధించింది.  ఇప్పటి నుంచి టీమిండియాను చాలా మంది పేపర్‌ టైగర్స్‌ అంటారు.

మొదటి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్‌ అయినపుడు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ప్రతి ఒక్కరికి చెడ్డరోజు ఒకటి ఉంటుందని చెప్పాడు. మేము కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తాం. కానీ.. రెండో టెస్టులో మీరేం చేశారు? పూర్తిగా ఓ‍టమికి సిద్ధపడ్డట్లే కనిపించారు. బయటివాళ్ల మాటలు పట్టించుకోమని రోహిత్‌ శర్మ అంటున్నాడు.

కానీ.. ఈ రెండు టెస్టులను చూస్తే మీరు ఒత్తిడికి గురవుతున్నారని స్పష్టమైంది. ఏదో స్కూల్‌ పిల్లలు ఆడుతున్నట్లుగా ఆడారు’’ అని అహ్మద్‌ షెహజాద్‌ విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్‌ బదులిస్తూ.. ‘‘పాకిస్తాన్‌ వరుస ఓటముల తర్వాత ఒక్క సిరీస్‌ గెలిచింది. 

 మీ సంగతి ఏమిటి?
మరి మీ జట్టు చిత్తుగా ఓడినపుడు మీరెందుకు ఇలా మాట్లాడలేదు. టీమిండియా తిరిగి పుంజుకుంటుంది. అయినా.. మా జట్టు ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరింది. ఈసారి కూడా టైటిల్‌ పోరుకు చేరువైంది. మరి మీ సంగతి ఏమిటి?’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. 

కాగా సొంతగడ్డపై చిత్తుగా సిరీస్‌లు ఓడిన పాకిస్తాన్‌ ఇటీవల ఇంగ్లండ్‌పై 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచిన విషయ తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య నవంబరు 1 నుంచి ముంబైలో మూడో టెస్టు మొదలుకానుంది.

చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్‌ టూర్‌కు ఎంపికైన పేసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement