
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ (MI Vs PBKS)జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం (మే 11) ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో వేదికను ధర్మశాల (Dharmashala) నుంచి అహ్మదాబాద్కు మార్చారు.
సిద్ధంగా ఉన్నాం
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ఈ విషయం గురించి స్పోర్ట్స్టార్కు వెల్లడించారు. ‘‘చివరి నిమిషంలో ధర్మశాల నుంచి వేదికను మార్చాల్సి వచ్చినపుడు.. బీసీసీఐ మమ్మల్ని సంప్రదించింది. మ్యాచ్ నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామని వారికి సమాచారం ఇచ్చాము’’ అని తెలిపారు.
కాగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పంజాబ్ కింగ్స్కు రెండో సొంత మైదానం. ఇక్కడ మూడు మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ శ్రేయస్ సేన ఓ మ్యాచ్ ఆడింది. మే 3న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడి 37 పరుగులు తేడాతో గెలిచింది.
ఇక ఈ రోజు అంటే మే 8న ఢిల్లీ క్యాపిటల్స్తో పంజాబ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో మే 11న ముంబై ఇండియన్స్ను ఢీకొట్టాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడికి ప్రయాణించే పరిస్థితి లేదు.
వాంఖడేకు మారుస్తారనుకుంటే
ఈ నేపథ్యంలో వేదికను ముంబైలోని వాంఖడేకు మారుస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఏ జట్టుకు హోం అడ్వాంటేజీ ఉండకూడదనే ఉద్దేశంతో వేదికను తటస్థంగా అహ్మదాబాద్కు మార్చినట్లు సమాచారం. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు ముంబై గురువారమే అక్కడికి చేరుకునే అవకాశం ఉండగా.. పంజాబ్ ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకోనుంది.
భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు
కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ముష్కరులకు బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో దాయాది దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉగ్రవాద శిబిరాలపై దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. మిసైళ్లతోనూ దాడి చేయగా భారత్ విజయవంతంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్కు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉంటే.. పంజాబ్ ఇప్పటికి పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్రస్తుతం 15 పాయింట్లు కలిగి ఉన్న పంజాబ్.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ముంబై నాలుగో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
The many colours of IPL 🎨
From the eyes of Painter Andy Brown 🧑🎨
Presenting - 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗮𝗻𝗱 𝗖𝗮𝗻𝘃𝗮𝘀 ft. #TATAIPL 🌄
WATCH the full video 🎥 🔽 -By @mihirlee_58 | #PBKSvDChttps://t.co/EfOvuYOD86 pic.twitter.com/wtbw0VMNMS— IndianPremierLeague (@IPL) May 8, 2025