ఆక్లాండ్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (నవంబర్ 6) జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్ చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. చాప్మన్ ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో చాప్మన్తో పాటు టిమ్ రాబిన్సన్ (39 బంతుల్లో 25; 5 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఆఖర్లో డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), మిచెల్ సాంట్నర్ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. మిగతా ఆటగాళ్లలో డెవాన్ కాన్వే 16, రచిన్ రవీంద్ర 11, బ్రేస్వెల్ 5 పరుగులు చేశారు.
విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీశారు. జేడన్ సీల్స్ (4-0-61-0), అకీల్ హొసేన్కు (1-0-23-0) చాప్మన్ చుక్కలు చూపించాడు. ఫోర్డ్ (4-0-17-1), ఛేజ్ (4-0-33-2), హోల్డర్ (4-0-34-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.
కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్ననే జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ పోరాటం వృధా అయ్యింది. 165 పరుగుల ఛేదనలో సాంట్నర్ చెలరేగి ఆడినా (28 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అంతకుముందు విండీస్ ఇన్నింగ్స్లో షాయ్ హోప్ (53) అర్ద సెంచరీతో రాణించాడు.
చదవండి: వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు వీరే..!


