ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు ఇదే! | Not Jaiswal Gavaskar Picks This Batter To Open For India Against Ireland | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు ఇదే!

Jun 4 2024 6:46 PM | Updated on Jun 4 2024 7:24 PM

Not Jaiswal Gavaskar Picks This Batter To Open For India Against Ireland

యశస్వి జైస్వాల్‌- విరాట్‌ కోహ్లి (PC: BCCI)

టీ20 ప్రపంచకప్‌-2024 ఫీవర్‌ తారస్థాయికి చేరింది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా జూన్‌ 5న ఐర్లాండ్‌తో రోహిత్‌ సేన తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తోడుగా విరాట్‌ కోహ్లి భారత ఇన్నింగ్స్‌ ఆరంభించాలని పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

ఇక తన జట్టులో మిగిలిన స్థానాల్లో సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లకు చోటిచ్చాడు గావస్కర్‌. వికెట్‌ కీపర్‌ కోటాలో పంత్‌కు చోటిచ్చిన గావస్కర్‌ సంజూ శాంసన్‌కు మొండిచేయి చూపాడు.

‌కాగా వరల్డ్‌కప్‌-2024లో భారత ఓపెనింగ్‌ జోడీ గురించి చర్చ జరుగుతున్న వేళ.. విరాట్‌ కోహ్లియే రోహిత్‌ శర్మకు సరైన జోడీ అని ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా గావస్కర్‌ కూడా ఇదే మాట అన్నాడు.

ఇక కోహ్లి ఐపీఎల్‌-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ 15 మ్యాచ్‌లు ఆడి.. 741 పరుగులు సాధించాడు. టాప్‌ స్కోరర్‌గా నిలిచి.. ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.

ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు గావస్కర్‌ ఎంచుకున్న భారత తుది జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement