
నేపాల్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. టోర్నీ చరిత్రలో తొలి విజయం సాధించడంతో నేపాల్ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. విన్నింగ్ రన్ కొట్టగానే నేపాల్ ఆటగాళ్లంతా మైదానంలో చేరి సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.
HISTORY CREATED BY NEPAL....!!!
- Nepal won their first ever match in Women's Asia Cup history. 🫡 pic.twitter.com/V8CwPaybqe— Johns. (@CricCrazyJohns) July 19, 2024
కాగా, మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో యూఏఈ, నేపాల్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేయగా.. నేపాల్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సత్తా చాటిన ఇందు బర్మా
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నేపాల్ కెప్టెన్ ఇందు బర్మా (4-0-19-3) సత్తా చాటడంతో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. నేపాల్ బౌలర్లు తలో చేయి వేయడంతో యూఏఈ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. షబ్నమ్ రాయ్, కబిత జోషి, క్రితిక తలో వికెట్ పడగొట్టారు. యూఏఈ ఇన్నింగ్స్లో ఇషా రోహిత్ ఓఝా (10), సమైరా ధర్నిధర్కా (13), కవిష ఎగోడగే (22), ఖుషి శర్మ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
చెలరేగిన సంజనా
116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. ఓపెనర్ సంజనా ఖడ్కా (45 బంతుల్లో 72 నాటౌటగ్; 11 ఫోర్లు) చెలరేగడంతో సునాయాసంగా విజయం సాధించింది. యూఏఈ బౌలర్లలో కవిష 3 వికెట్లతో సత్తా చాటినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.