ఇదేం బౌలింగ్‌?.. హార్దిక్‌ పాండ్యా శైలిపై కోచ్‌ అసంతృప్తి! | Morne Morkel Unhappy With Hardik Bowling, Has Intense Chat In Nets With All Rounder Before 1st T20I, Says Report | Sakshi
Sakshi News home page

ఇదేం బౌలింగ్‌?.. హార్దిక్‌ శైలిపై కోచ్‌ అసంతృప్తి!.. ఇకపై..

Oct 4 2024 12:57 PM | Updated on Oct 4 2024 1:33 PM

Morne Morkel Unhappy With Hardik Bowling Has Intense Chat In Nets: Report

దాదాపు రెండు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సందర్భంగా ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ పర్యవేక్షణలో యువ పేస్‌ దళంతో కలిసి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

హార్దిక్‌ పాండ్యా శైలిపై కోచ్‌ అసంతృప్తి!
అయితే, హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ శైలి పట్ల మోర్కెల్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. స్టంప్స్‌నకు మరీ దగ్గరగా బంతిని విసిరే విధానాన్ని మార్చుకోవాలని హార్దిక్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. పరిగెత్తుతూ.. బాల్‌ను రిలీజ్‌ చేసేటపుడు కూడా ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఆల్‌రౌండర్‌తో మోర్కెల్‌ గట్టిగానే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తన శైలికి భిన్నంగా మోర్కెల్‌ కాస్త స్వరం హెచ్చించి మరీ.. పాండ్యాకు పదే పదే బౌలింగ్‌ యాక్షన్‌ గురించి హితభోద చేసినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. అయితే, ఇందుకు పాండ్యా కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అనంతరం.. యువ ఫాస్ట్‌బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, మయాంక్‌ యాదవ్‌లపై మోర్కెల్‌ దృష్టి సారించి.. వారి చేత ప్రాక్టీస్‌ చేయించినట్లు సమాచారం.

సూర్యకుమార్‌ యాదవ్‌కు పెద్దపీట
ఇదిలా ఉంటే.. పేస్‌ బ్యాటరీ స్పీడ్‌ గన్స్‌ను తీసుకువచ్చిందంటూ ఈ బౌలర్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. కాగా హార్దిక్‌ పాండ్యా చివరగా శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, ఈ టూర్‌ సందర్భంగా భారత పొట్టి క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌ పేరును ప్రకటిస్తారనుకుంటే.. బీసీసీఐ మాత్రం సూర్యకుమార్‌ యాదవ్‌కు పెద్దపీట వేసింది. 

మూడు టీ20లు.. వేదికలు ఇవే
అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌కు గాయాల బెడద పొంచి ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు. ఇక తాజా సిరీస్‌ విషయానికొస్తే.. ఆదివారం(అక్టోబరు 6) నుంచి టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య టీ20 సిరీస్‌ మొదలుకానుంది. ఇందులో భాగంగా జరిగే మూడు మ్యాచ్‌లకు గ్వాలియర్‌(అక్టోబరు 6), ఢిల్లీ(అక్టోబరు 9), హైదరాబాద్‌(అక్టోబరు 12) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 

ఈ క్రమంలో మొదటి టీ20 కోసం గ్వాలియర్‌కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా యువ స్పీడ్‌ గన్‌ మయాంక్‌ యాదవ్‌ తొలిసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.

బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

చదవండి: T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement