ఒకప్పుడు ఆ ఊరివాళ్లు బస్సు ఎక్కాలంటే ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారికి ఆ శ్రమ తప్పింది. బస్సు వారిని వెదుక్కుంటూ వచ్చింది. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలోని మారుమూల గ్రామం కుర్తాల్లో తొలిసారిగా బస్సు సర్వీస్ మొదలైంది. ఈ బస్సుకు గ్రామస్తులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. ఆనందంతో నృత్యాలు చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు.
ఈ సరికొత్త బస్సు సర్వీసు గ్రామస్తుల దైనందిన జీవితంలో గణనీయమైన మార్పు తీసుకురానుంది. తమ అవసరాలకు సమీపంలోని పట్టణాలకు వెళ్లడం సులువు అవుతుంది. సమీప పట్టణానికి వెళ్లడానికి ఇప్పటివరకు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్న గ్రామస్తులకు ఈ బస్సు సర్వీస్ ఊరటనిస్తోంది. ‘స్వాతంత్య్రం వచ్చిన ఎన్నో దశాబ్దాల తరువాత ఒక గ్రామానికి తొలిసారిగా బస్సు వచ్చింది. ఇందుకు కారణం ఏమిటి?’ అనే కోణంలో నెటిజనుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.


