చనిపోయే ముందు ఇన్స్టాగ్రాంలో వైరల్ పోస్టు
ఆంధ్రప్రదేశ్: ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్స్ట్రాగామ్లో పోస్టుపెట్టి ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తాను మరణించబోతున్నానని.. మరణించిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. అంటూ ఐదు రకాల స్టేటస్లు పెట్టి మృతి చెందాడు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికుల వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక కూమారుడు జనార్దన్రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందగా తనని పట్టించుకునే వారు లేక మద్యానికి బానిసమయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవవై వేలాడుతూ కనిపించాడు. మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చర్చనీయాంశంగా మారిన చివరి స్టేటస్..
జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్స్ట్రాగామ్ స్టేటస్లో తాను చనిపోతున్నట్లు ఓ సినిమాకు సంబంధించిన స్టేటస్, అలాగే చనిపోయిన తరువాత తన మెదడు ఏడు నిమిషాలు పనిచేస్తుందని.. అప్పుడు కూడా ఒక అమ్మాయి గురించే ఆలోచిస్తుందని.. చనిపోయిన తర్వాత తన స్నేహితులు అంత్యక్రియలు బాధతో నిర్వహిస్తారని అర్థం వచ్చేలా స్టేటస్ వీడియోలు పెట్టాడు. ఆపై ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించింది.
గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com


