
PC: BCCI
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు.. అంతే త్వరగా కనుమరుగైపోయిన దాఖలాలు ఉన్నాయన్నాడు. కాబట్టి వైభవ్ ఆచితూచి అడుగేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకోవాలని సూచించాడు.
రూ. 1.10 కోట్లకు
దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్- 2025 (IPL 2025) మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది.
తొలి బంతినే సిక్సర్గా మలిచాడు
కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో వైభవ్ వచ్చాడు. టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్తో కలిపి రాజస్తాన్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టిన క్రికెటర్గా చరిత్రకెక్కిన ఈ బిహార్ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు.
అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్ల జాబితాలో వైభవ్ చేరిపోయాడు. ఆ మ్యాచ్లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 34 పరుగులు సాధించాడు. ఇక తాజాగా గురువారం ఆర్సీబీతో మ్యాచ్లోనూ వైభవ్ దూకుడుగానే ఆడాడు. రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నిష్క్రమించాడు.
కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు
ఈ పరిణామాల నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘బాగా ఆడితే ప్రశంసిస్తారని.. ప్రదర్శన బాగా లేకుంటే విమర్శిస్తారని తెలిసిన ఆటగాడు గర్వం తలకెక్కించుకోకుండా ఉంటాడు. అతడి కాళ్లు భూమ్మీదే ఉంటాయి.
కానీ చాలా మంది ఆటగాళ్లు.. ఒకటీ- రెండు మ్యాచ్ల ద్వారా ఫేమస్ అయిన వెంటనే దారి తప్పుతారు. తాము స్టార్ ప్లేయర్ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారు.
ఇక సూర్యవంశీ విషయానికొస్తే.. అతడు మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో ఉండాలి. విరాట్ కోహ్లిని చూడండి.. తను 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటికి 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు.
కోహ్లి మాదిరే సూర్యవంశీ ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఈ ఐపీఎల్ సీజన్లో సాధించిన దానితో సంతోషపడి.. నేను కోటీశ్వరుడిని.. నా అరంగేట్రమే అద్భుతం.. తొలి బంతికే సిక్స్ కొట్టాను.. అనే ఆలోచనలతో ఉంటే.. బహుశా వచ్చే ఏడాది మనం అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్లో రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా బెంగళూరు జట్టు ఈ సీజన్లో సొంత మైదానంలో తొలి విజయం సాధించగా.. రాజస్తాన్ తొమ్మిదింట ఏడు పరాజయాలు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్
𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡
Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝
Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025