
మ్యూనిక్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్లో రెండో రోజు బుధవారం భారత్ ఒక్క పతకం కూడా గెలుచుకోలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనూ భాకర్, చైన్ సింగ్ తమ విభాగాల్లో ఫైనల్స్కు అర్హత సాధించినా మెడల్ మాత్రం దక్కలేదు. మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో మనూ 588 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరింది. అయితే అసలు పోరులో ఆమె తడబడింది. ఫైనల్లో 20 పాయింట్లు మాత్రమే సాధించి మూడో ఎలిమినేషన్ రౌండ్ను దాటలేకపోయింది.
ఇదే ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ కూడా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్లో 585 పాయింట్లకే పరిమితమైన 11వ స్థానంలో నిలిచిన ఇషా ఫైనల్కు కూడా అర్హత సాధించలేదు. మరో భారత షూటర్ సిమ్రన్ప్రీత్ కౌర్ 32వ స్థానంలో నిలిచింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో చైన్ సింగ్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇటీవల అర్జెంటీనాలో జరిగిన ప్రపంచ కప్లో కాంస్యం గెలిచిన చైన్ సింగ్ క్వాలిఫయింగ్లో ఐదో స్థానంలో ఫైనల్కు చేరినా పతకం మాత్రం దక్కలేదు. నేడు జరిగే పోటీల్లో భారత షూటర్లు అర్జున్ బబూటా, సందీప్ సింగ్, సిఫ్ట్ కౌర్, శ్రియాంక, ఆషి చౌక్సీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.