KS Bharat Says That He Is Ready To Play All Cricket Formats, Deets Inside - Sakshi
Sakshi News home page

టెస్ట్‌లు ఒక్కటే కాదు.. అన్ని ఫార్మాట్లకు సిద్ధం: కేఎస్‌ భరత్‌

Published Mon, Jun 26 2023 6:59 AM

KS Bharat Says That He Is Ready To Play All Formats - Sakshi

సాక్షి, సిటీ బ్యూరో: వచ్చే నెలలో వెస్టిండీస్‌ జట్టుతో జరిగే టెస్ట్‌ సిరీస్‌ కోసం సన్నద్ధమవుతున్నానని భారత జట్టు వికెట్‌ కీపర్, ఆంధ్ర క్రికెటర్‌ కోన శ్రీకర్‌ (కేఎస్‌) భరత్‌ వ్యాఖ్యానించాడు. రాబోయే రోజుల్లో వన్డే, టి20 ఫార్మాట్‌లలోనూ భారత జట్టులో ఎంపిక కావడమే తన తదుపరి లక్ష్యమని భరత్‌ తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన రెటీనా పెయింట్స్‌ దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించడంలో భాగంగా క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ను తమ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది.

దీనికి సంబంధించి ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో భరత్‌ మాట్లాడుతూ... వ్యక్తిగత వృద్ధి కన్నా సంస్థ అభివృద్దే లక్ష్యంగా పనిచేసే బృందమున్న రెటీనా పెయింట్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనుండటం తన బాధ్యతను పెంచిందని అన్నాడు. 22 ఏళ్లుగా క్రికెట్‌తో ప్రయాణిస్తున్నానని, తిరిగి చూసుకుంటే ఇక్కడి గల్లీ క్రికెట్‌ అనుభవాలు గుర్తుకొస్తున్నాయని భరత్‌ పేర్కొన్నాడు.

ఆటపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ రాహుల్‌ ద్రవిడ్, ధోనీని అభిమానిస్తానని అన్నాడు. తనకు తెలుపు రంగు అంటే ఇష్టమని... దానికి తగ్గట్టుగానే మొదటగా టెస్ట్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందన్నాడు. ఈ కార్యక్రమంలో రెటీనా పెయింట్స్‌ ఎండీ రాకేష్‌ కూడా పాల్గొన్నారు.    

Advertisement
Advertisement