
Sourav Ganguly disagreed with Shoaib Akhtar’s suggestion: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కెరీర్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలను భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ కొట్టిపారేశాడు. కోహ్లి తనకు నచ్చినన్ని రోజులు నచ్చిన తీరుగా ఆడతాడని వ్యాఖ్యానించాడు. కాగా ఆగష్టు 18, 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్లో శుక్రవారం నాటితో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
వరల్డ్కప్ తర్వాత గుడ్బై చెబితే!
ఈ సందర్భంగా రన్మెషీన్పై ప్రశంసల వర్షం కురిపించిన షోయబ్ అక్తర్.. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్కు కోహ్లి వీడ్కోలు పలికితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సెంచరీ సెంచరీల రికార్డు బద్దలు కొట్టాలంటే విరాట్ ఇకపై పూర్తిగా టెస్టు క్రికెట్పైనే దృష్టి సారించాలని సూచించాడు.
ఈ మేరకు.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి 50- ఓవర్ల క్రికెట్ ఎక్కువగా ఆడకపోతేనే మంచిది. టీ20ల విషయంలోనూ ఆలోచించాలి. కనీసం ఇంకా ఆరేళ్లపాటు కోహ్లి క్రికెట్ ఆడాలి. అప్పుడే సచిన్ టెండుల్కర్ రికార్డు బ్రేక్ చేయగలడు.
అక్తర్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన దాదా
వరల్డ్కప్ తర్వాత అతడు పూర్తిగా టెస్టు క్రికెట్పై దృష్టి సారించాలి’’ అని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ రెవ్స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. అయితే, అక్తర్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా గంగూలీని కోరగా.. ‘‘ఎందుకు? విరాట్ కోహ్లి తనకు ఎన్నాళ్లు ఆడాలనిపిస్తే అన్నాళ్లు ఆడతాడు.
నాడు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి
అది కూడా తనకిష్టమైన ఫార్మాట్లో ఆడతాడు. ఎందుకంటే ఇప్పటికీ తను మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు’’ అని బదులిచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పగా.. నాడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ప్రోద్బలంతోనే వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించినట్లు వార్తలు వచ్చాయి.
కోహ్లిని అడిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని గంగూలీ చెప్పగా.. అసలు తనను ఎవరూ సంప్రదించలేదని ప్రెస్మీట్ పెట్టి మరీ కోహ్లి దాదా వ్యాఖ్యలను ఖండించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. గంగూలీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చదవండి: ఐర్లాండ్తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్