స్టేడియం వద్ద తొక్కిసలాట.. మదిలోకి చిన్నస్వామి భయానక ఘటన! | Jharkhand T20 Stampede Brings-Memories-RCB Chinnaswamy Crowd Crush | Sakshi
Sakshi News home page

Jharkhand T20 League: జార్ఖండ్‌ స్టేడియం వద్ద తొక్కిసలాట.. మదిలోకి చిన్నస్వామి భయానక ఘటన!

Jun 24 2026 12:31 PM | Updated on Jun 24 2026 12:53 PM

Jharkhand T20 Stampede Brings-Memories-RCB Chinnaswamy Crowd Crush

జేఎస్‌సీఏ స్టేడియం వద్ద జన సందోహం

జార్ఖండ్ టీ20 లీగ్‌ ఫైనల్‌ సందర్భంగా మంగళవారం సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. జేఎస్‌సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వెలుపల భారీ జనసందోహం కారణంగా తొక్కిసలాట జరగడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది.

ఫైనల్ పోరును ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియం నిర్వాహకులు ఉచిత ప్రవేశం కల్పించడమే ఈ గందరగోళానికి దారి తీసింది. ఉచితం కావడంతో ఊహించని స్థాయిలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకులు ఒకేసారి స్టేడియం గేట్ల వద్దకు తరలివచ్చారు. లోపలికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో కొందరు అదుపుతప్పి కిందపడిపోయారు. 

అయితే వెలుపల ఇంతటి ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, మైదానం లోపల జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా సాగింది. ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ అత్యంత వేగంగా స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్య శాఖ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని మంత్రి హామీ ఇచ్చారు.

అయితే తాజాగా జార్ఖండ్ టీ20లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట గతేడాది చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటను గుర్తుకుతెచ్చిందని కొందరు అభిమానులు పేర్కొన్నారు. స్టేడియం వద్ద చెప్పులు చిందర వందరగా పడి ఉండడం తమకు ఆ కాళరాత్రిని గుర్తు చేసిందని పలువురు వాపోయారు. 


2025లో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట (ఫైల్‌)

అయితే అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశమని వెల్లడించారు. ఇక 2025 ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవాలు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. అయితే ఊహించని విధంగా ఎక్కువ మంది అభిమానులు రావడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. దీంతో తొక్కిసలాట జరగడంతో దాదాపు 11 మంది మృతి చెందగా, దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇక జార్ఖండ్ టీ20 లీగ్ విజేతగా చోటా నాగ్‌పూర్ రాయల్స్ నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన జంషెడ్‌పూర్ స్టీలర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హర్ష్ రానా (24 బంతుల్లో 64) మెరుపు అర్ధశతకం సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన చోటా నాగ్‌పూర్ 16 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇండియా-ఏ తరఫున అదరగొట్టిన కుమార్ కుషాగ్ర 39 బంతుల్లోనే 78 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

 

చదవండి: నాకౌట్‌కు కొలంబియా.. ప్రత్యేక ఆకర్షణ మాత్రం అతడే!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement