ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 24) మధ్యాహ్నం అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్పై ఈ మ్యాచ్తో దాదాపుగా క్లారిటీ వస్తుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కు డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఓడిందా ఇంటిముఖం పడుతుంది.
ఇలాంటి కీలక మ్యాచ్లో రాజస్థాన్ టాస్ దగ్గరే సగం మ్యాచ్ కోల్పోయింది. టాస్ ఓడిన ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రత్యర్ది కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగాడు. బ్యాటింగ్కు వచ్చీ రాగానే రాజస్థాన్కు ఒకే స్కోర్ వద్ద రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17 బంతుల్లో 27; ఫోర్, 3 సిక్సర్లు), వైభవ్ సూర్యవంశీ (6 బంతుల్లో 4) నాలుగు బంతుల వ్యవధిలో 33 పరుగుల టీమ్ స్కోర్ వద్ద ఔటయ్యారు.
ఈ పరిణామంతో రాజస్థాన్ ఢీలా పడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఫామ్లో ఉన్న ఓపెనర్లు త్వరగా ఔట్ కావడంతో ఆ జట్టు డిఫెన్స్లో పడింది. ఈ మ్యాచ్లో వైభవ్పై రాజస్థాన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సీజన్లో ప్రారంభం నుంచి దుమ్మురేపిన వైభవ్ కీలక మ్యాచ్లో చేతులెత్తేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వైభవ్ ఈ మ్యాచ్కు ముందు 13 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 577 పరుగులు చేశాడు. ఇందులో 50 ఫోర్లు, 53 సిక్సర్లు సహా సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. వైభవ్, జైస్వాల్ వికెట్లు కోల్పోయిన మరికొద్ది సేపటికే రాజస్థాన్కు మరో షాక్ తగిలింది. 54 పరుగుల వద్ద కెప్టెన్ రియాన్ పరాగ్ (14) కూడా ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 60-3గా ఉంది. ధృవ్ జురెల్ (11), దసున్ షనక (2) క్రీజ్లో ఉన్నారు.
ముంబై బౌలర్లలో విల్ జాక్స్, దీపక్ చాహర్, ఘజన్ఫర్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్ రాజస్థాన్కు ప్రాణసంకటమే అయినా ముంబైకి మాత్రం సాధారణ మ్యాచ్గా ఉంది. ఎందుకంటే ఈ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ముంబైతో పాటు లక్నో, సీఎస్కే, ఢిల్లీ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్లు దక్కించుకున్నాయి. మిగిలిన నాలుగో బెర్త్ కోసం రాజస్థాన్తో పాటు పంజాబ్, కేకేఆర్ పోటీపడుతున్నాయి.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోతే టోర్నీ నుంచి వైదొలుగుతుంది. అప్పుడు రేసులో పంజాబ్, కేకేఆర్ మిగిలి ఉంటాయి. రాత్రి ఢిల్లీతో జరిగే మ్యాచ్లో కేకేఆర్ గెలిస్తే, పంజాబ్తో పాటు 15 పాయింట్లు కలిగి ఉంటుంది. అప్పుడు మెరుగైన నెట్ రన్రేట్ కలిగిన జట్టు ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్దడపడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న ఆర్సీబీ-గుజరాత్ క్వాలిఫయర్లో పోటీపడతాయి.


