
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ డిమినేషన్ కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్ను వారి సొంత ఇలాకాలో ఓడించిన అనంతరం టాప్ ప్లేస్కు దూసుకొచ్చింది. ఈ గెలుపుతో కొద్ది రోజుల కిందట బెంగళూరులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రత్యర్థి హోం గ్రౌండ్స్లో ఆడిన ప్రతి మ్యాచ్లో గెలిచింది.
నిన్నటి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనల తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోరు), జోష్ హాజిల్వుడ్ (4-0-36-2 కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానానికి దూసుకొచ్చారు. బ్యాటింగ్లో విరాట్ (10 మ్యాచ్ల్లో 443 పరుగులు) టాప్ రన్ స్కోరర్గా.. బౌలింగ్లో హాజిల్వుడ్ (10 మ్యాచ్ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచారు. ఓవరాల్గా ఈ సీజన్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతుంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు (ఆరెంజ్ క్యాప్)
విరాట్ కోహ్లి- 443
సూర్యకుమార్ యాదవ్- 427
సాయి సుదర్శన్- 417
నికోలస్ పూరన్- 404
మిచెల్ మార్ష్- 378
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (పర్పుల్ క్యాప్)
జోష్ హాజిల్వుడ్- 18
ప్రసిద్ద్ కృష్ణ- 16
నూర్ అహ్మద్- 14
ట్రెంట్ బౌల్ట్- 13
కృనాల్ పాండ్యా- 13
అత్యధిక హాఫ్ సెంచరీలు- విరాట్ (6)
పాయింట్ల పట్టిక
1. ఆర్సీబీ (14 పాయింట్లు, 0.521 రన్రేట్)
2. గుజరాత్ టైటాన్స్ (12, 1.104)
3. ముంబై ఇండియన్స్ (12, 0.889)
4. ఢిల్లీ క్యాపిటల్స్ (12, 0.482)
5. పంజాబ్ కింగ్స్ (11, 0.177)
కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (51), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.
టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు (18.3 ఓవర్లలో). ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది.