
ఐపీఎల్ 2025లో తదుపరి ఆడబోయే అత్యంత కీలకమైన మ్యాచ్లకు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవ్స్లో సేద తీరుతున్నారు. ఏప్రిల్ 25న సీఎస్కేపై విజయానంతరం ఆరెంజ్ ఆర్మీ మాల్దీవ్స్కు చెక్కేసింది. అప్పటి నుంచి సన్రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవ్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సన్రైజర్స్ స్టార్ ఆటగాళ్లు సరదాగా గడుపుతున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో ప్రత్యక్షమైంది.
Ishan Kishan Vs Abhishek Sharma in the volleyball game. 😄 pic.twitter.com/d46iqYQlR7
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2025
ఈ వీడియోలో సన్రైజర్స్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ డ్రింక్ తాగుతూ సేద తీరుతుండగా.. మరో విధ్వంకర బ్యాటర్ ఇషాన్ కిషన్ సహచరులతో వాలీబాల్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
కీలక మ్యాచ్లకు ముందు తమ ఆటగాళ్లకు రీఫ్రెష్మెంట్ అవసరమని సన్రైజర్స్ యాజమాన్యం మాల్దీవ్స్ టూర్ ప్లాన్ చేసింది. సన్రైజర్స్ తమ తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ మే 2న అహ్మదాబాద్లో జరుగనుంది. దీని తర్వాత సన్రైజర్స్ వరుసగా ఢిల్లీ (మే 5, హైదరాబాద్), కేకేఆర్ (మే 10, హైదరాబాద్), ఆర్సీబీ (మే 13, బెంగళూరు), లక్నోతో (మే 18, లక్నో) మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
గత మ్యాచ్లో సీఎస్కేపై గెలుపుతో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సన్రైజర్స్ తదుపరి ఆడాల్సిన ఐదు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతేడాది రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్కు ఆశించిన ఫలితాలు సాధించలేదు. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గెలిచి.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్,గుజరాత్). తర్వాత పంజాబ్పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది. తాజాగా సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది.
కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగుల రికార్డు స్కోర్ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు.
ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ గెలవడానికి సన్రైజర్స్కు ఐదు మ్యాచ్ల సమయం పట్టింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్రైజర్స్ రెండో విజయం సాధించింది. తాజాగా సన్రైజర్స్ సీఎస్కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది.