పసిడి పతకం నెగ్గిన హిమాన్షు | India wins first gold medal at Youth Athletics Championship | Sakshi
Sakshi News home page

పసిడి పతకం నెగ్గిన హిమాన్షు

Apr 19 2025 1:55 AM | Updated on Apr 19 2025 1:55 AM

India wins first gold medal at Youth Athletics Championship

దమ్మామ్‌ (సౌదీ అరేబియా): ఆసియా అండర్‌–18 యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో హిమాన్షు భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు. 17 ఏళ్ల హిమాన్షు జావెలిన్‌ను 67.57 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. లు హావో (చైనా; 63.45 మీటర్లు) రజతం... రుసియన్‌ సాదుల్లాయెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌; 61.96 మీటర్లు) కాంస్యం సాధించారు.

హరియాణా మహిళా అథ్లెట్‌ ఆర్తి తన ఖాతాలో రెండో కాంస్య పతకాన్ని జమ చేసుకుంది. 200 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని సాధించింది. ఆర్తి 24.31 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. 100 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 

మరోవైపు పురుషుల హైజంప్‌లో దేవక్‌ భూషణ్‌ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. భూషణ్‌ 2.03 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల షాట్‌పుట్‌లో నిశ్చయ్‌ రజత పతకం దక్కించుకోగా... పురుషుల మెడ్లీ రిలేలో చిరంత్, సయ్యద్‌ సాబీర్, సాకేత్‌ మింజ్, కదీర్‌ ఖాన్‌లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement