ఫైల్ ఫొటో (PC: BCCI X)
శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమచారం. కెప్టెన్ శుబ్మన్ గిల్ వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.
బలంగా తాకిన బంతి
అయితే, అంతకంటే ముందు భారత్.. శ్రీలంక ఎలెవన్ జట్టుతో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ గాయపడినట్లు రెవ్స్పోర్ట్స్ వెల్లడించింది. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి బొటనవేలికి బంతి బలంగా తాకిందని పేర్కొంది.
ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి గిల్ గాయాన్ని పరిశీలించాడు. ట్రీట్మెంట్ తీసుకున్న గిల్.. కాసేపటి తర్వాత బ్యాటింగ్ సెషన్ కొనసాగించినట్లు పేర్కొంది. కాగా భారత్- శ్రీలంక ఎలెవన్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్కు కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC) వేదిక.
ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా శ్రీలంకలో సత్తా చాటాల్సిందే. ఆతిథ్య జట్టును 2-0తో వైట్వాష్ చేస్తేనే గిల్ సేన అవకాశాలు మెరుగుపడతాయి.
చివరగా వైట్వాష్
డబ్ల్యూటీసీలో భాగంగా చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా ప్రత్యర్థి చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. అనంతరం.. అఫ్గానిస్తాన్తో ఇటీవల నామమాత్రపు టెస్టులో మాత్రం విజయం సాధించింది. అయితే, ఇది డబ్ల్యూటీసీలో భాగం కాదు.
ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంకతో సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో బారాముల్లా ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు.
అంతకుముందు ఇంగ్లండ్ పర్యటన సందర్భంగానే బుమ్రాతో పాటు గాయపడ్డ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సెలక్టర్లు 33 ఏళ్ల సారాంశ్ జైన్ను తొలిసారి టీమిండియాకు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గిల్ కండరాల నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే.
శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టు
శుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్నెస్ ఆధారంగా), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.


