నిన్న అద్భుత శతకం.. ఇప్పుడు మరీ ఘోరంగా! 71- 77 దాకా ఇదే తీరు! | Asia Cup 2023 Super 4, India Vs Sri Lanka: No Pakistan No Party - Fans React As Virat Kohli Falls For Just Three Runs Against Sri Lanka - Sakshi
Sakshi News home page

Virat Kohli: నిన్న అద్భుత శతకం.. ఇప్పుడు మరీ ఇంత ఘోరంగా! అదీ అతడి చేతిలోనే!

Sep 12 2023 6:56 PM | Updated on Sep 12 2023 7:12 PM

Ind vs SL No Pakistan No Party: Fans React As Kohli Falls For Just 3 Runs - Sakshi

 Asia Cup, 2023 - India vs Sri Lanka- Virat Kohli: శ్రీలంకలో మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు. ఆసియా కప్‌-2023 సూపర్‌-4 దశలో భాగంగా కొలంబోలో జరుగుతున్న మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలింగ్‌లో తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యాడు. దసున్‌ షనకు క్యాచ్‌ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. 

అదే బలహీనత..
కాగా 2021 నుంచి ఇప్పటి వరకు లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలింగ్‌లో కోహ్లి 159 బంతులు ఎదుర్కొని సగటు 13తో 104 పరుగులు సాధించాడు. ఎనిమిదిసార్లు పెవిలియన్‌ చేరాడు. శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా లెఫ్టార్మ్‌ స్సిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లికి ఉన్న ఈ బలహీనత మరోసారి బయటపడింది.

నిన్న సెంచరీ.. ఈరోజు ఇలా దారుణంగా
ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి అవుటైన తీరు క్రికెట్‌ అభిమానులకు రుచించడం లేదు. ‘‘నిన్న సెంచరీ.. ఈరోజు ఇలా! ఏంటిది కోహ్లి! ఇలాగేనా ఆడేది? 20 ఏళ్ల యువ బౌలర్‌ చేతిలో నువ్వు అవుటైన తీరు నీ స్థాయికి ఏమాత్రం తగదు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రమే బ్యాట్‌ ఝులిపిస్తావా ఏంటి?’’ అని ట్రోల్‌ చేస్తున్నారు. 71- 77వ సెంచరీ దాకా.. శతకం బాదిన తదుపరి ఇన్నింగ్స్‌లో సింగిల్‌ డిజిట్‌ మాత్రమే స్కోరు చేయడం కోహ్లికి అలవాటని ఎద్దేవా చేస్తున్నారు.

పాకిస్తాన్‌పై సూపర్‌ సెంచరీ
కాగా సూపర్‌-4లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా వింటేజ్‌ కోహ్లిని గుర్తు చేస్తూ కోహ్లి క్లాసిక్‌ ఇన్నింగ్స్‌తో బౌలర్లపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో వీర విహారం చేసిన కింగ్‌.. 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 77వ సెంచరీ నమోదు చేశాడు.

తద్వారా టీమిండియా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అయితే, 15 గంటలు తిరిగే లోపే శ్రీలంకతో ఆరంభమైన మ్యాచ్‌లో మాత్రం కోహ్లి విఫలమయ్యాడు. అదే సమయంలో పాకిస్తాన్‌ మీద కోహ్లితో పాటు అజేయ సెంచరీ(111)తో ఆకట్టుకున్న కేఎల్‌ రాహుల్‌ 39 పరుగులతో రాణించాడు

తిప్పేసిన వెల్లలగే, అసలంక
ఇక వర్షం మొదలయ్యే సమయానికి టీమిండియా 47 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 53 పరుగులు సాధించాడు. ఇక లంక స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగేకు అత్యధికంగా 5 వికెట్లు దక్కగా.. ఆఫ్‌బ్రేక్‌ స్పిన్‌ బౌలర్‌ చరిత్‌ అసలంక 4 వికెట్లు పడగొట్టాడు.  

చదవండి: ప్రచండులైన పాక్‌ బౌలర్లతోనే కాలేదు.. ఈ కుర్రాడు టీమిండియాను కకావికలం చేశాడు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement