శ్రీలంకతో తొలి టెస్టు: శతకానికి చేరువలో కెప్టెన్‌.. కానీ! | IND A Vs SL A 1st Unofficial Test, Rain Halts Play As Dhruv Jurel Moves Closer To Century, More Details Inside | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో తొలి టెస్టు.. శతకానికి చేరువలో కెప్టెన్‌.. కానీ!

Jun 26 2026 11:43 AM | Updated on Jun 26 2026 12:11 PM

IND A vs SL A 1st Unofficial Test Jurel Near Century Rain Stops Play Update

శ్రీలంక- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ జోరు కొనసాగిస్తున్నాడు. గాలె వేదికగా రెండో రోజు నాటి ఆట సందర్భంగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శతకానికి చేరువయ్యాడు. అయితే, ఊహించని విధంగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది.

వాన పడింది
అప్పటికి ధ్రువ్‌ జురెల్‌ 177 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సాయంతో 97 పరుగులు చేశాడు. ఇంతలో వర్షం రావడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక వాన పడే సమయానికి భారత్‌- ‘ఎ’ జట్టు 99 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. అప్పటికి జురెల్‌తో పాటు హర్ష్‌ దూబే (7*) క్రీజులో ఉన్నాడు.

కాగా రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌- ‘ఎ’ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గురువారం గాలె అంతర్జాతీయ స్టేడియంలో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

సుదర్శన్‌ అద్భుత శతకం
ఈ క్రమంలో టాపార్డర్‌లో ఓపెనర్‌ ఆయుశ్‌ పాండే (25).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (12) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ అద్భుత శతకం సాధించాడు. మొత్తంగా 175 బంతుల్లో 19 బౌండరీలు బాదిల 132 పరుగులు చేశాడు.

మిగిలిన వారిలో రుతురాజ్‌ గైక్వాడ్‌ (22) కూడా విఫలం కాగా.. జురెల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. అతడికి తోడుగా గుంటూరు అబ్బాయి షేక్‌ రషీద్‌ అర్ధ శతకం (63)తో రాణించాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. 

ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్‌ 86 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఈ క్రమంలో 333/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌ 92వ ఓవర్లో షేక్‌ రషీద్‌ వికెట్‌ కోల్పోయింది. 

చదవండి: వైభవ్‌ అరంగేట్రం కోసం వాళ్లను బలిచేయలేము

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement