శ్రీలంక- ‘ఎ’ జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత్- ‘ఎ’ కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకం సాధించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 181 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా రెండు అనధికారిక టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
తొలిరోజు ఇలా
ఇందులో భాగంగా శ్రీలంక- భారత్ మధ్య గురువారం గాలేలో తొలి టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు ఆటలో ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 175 బంతులు ఎదుర్కొని పందొమ్మిది ఫోర్ల సాయంతో 132 పరుగులు సాధించాడు.
మిగిలిన వారిలో ఓపెనర్ ఆయుశ్ పాండే (25) ఫర్వాలేదనిపించగా.. దేవ్దత్ పడిక్కల్ (12), రుతురాజ్ గైక్వాడ్ (22) మాత్రం నిరాశపరిచారు. అయితే, ధ్రువ్ జురెల్తో పాటు షేక్ రషీద్ అర్ధ శతకాలతో రాణంచడంతో.. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 86 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.
శతక్కొట్టిన కెప్టెన్
ఇక 333/4 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే షేక్ రషీద్ (63) వికెట్ కోల్పోయింది. అయితే, కెప్టెన్ జురెల్ మాత్రం జోరు కొనసాగించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 97 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగించడంతో చాలాసేపు ఆటను నిలిపివేశారు.
అయితే.. ఆ తర్వాత వర్షం తెరిపినిచ్చినా వెట్ఫీల్డ్ కారణంగా మరికొంతసేపు ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలో కాసేపటికి మళ్లీ ఆట మొదలుకాగా.. జురెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. హర్ష్ దూబే 30 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఈ క్రమంలో టీ బ్రేక్ సమయానికి భారత్ 111.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 452 పరుగులు స్కోరు చేసింది. ధ్రువ్ జురెల్ 141, సారాంశ్ జైన్ 3 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక టీ బ్రేక్ తర్వాత భారత్.. అదే స్కోరు (452/6) వద్ద తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.


