ఆరోజు ముగ్గురం సెంచరీలు చేశామన్న సచిన్‌.. గంగూలీ రిప్లై ఇదే | IND Vs ENG: Sourav Ganguly Reacts To Sachin Tendulkar Post, Makes Bold Prediction Ahead Of Day 2 Test | Sakshi
Sakshi News home page

ఆరోజు ముగ్గురం సెంచరీలు చేశామన్న సచిన్‌.. గంగూలీ రిప్లై ఇదే

Jun 21 2025 12:25 PM | Updated on Jun 21 2025 1:28 PM

Ind vs Eng: Ganguly Reacts To Tendulkar Post Makes Bold Prediction

ఇంగ్లండ్‌ (Ind vs Eng Tests)తో టెస్టు సిరీస్‌ ప్రయాణంలో టీమిండియా శుభారంభం అందుకుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో.. శుక్రవారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలోనే పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ సేన.. 85 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు సాధించి పట్టు బిగించింది.

ఓపెనర్లలో కేఎల్‌ రాహుల్‌ (42) రాణించగా.. యశస్వి జైస్వాల్‌ (101) శతకంతో చెలరేగాడు. ఇక టీమిండియా టెస్టు సారథిగా తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ కూడా అద్భుత సెంచరీతో మెరిశాడు. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి గిల్‌ 127 పరుగులతో క్రీజులో ఉండగా.. వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) 65 పరుగులతో అతడికి తోడుగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా ప్రదర్శనపై బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) సంతృప్తి వ్యక్తం చేశాడు. కేఎల్‌ రాహుల్‌, జైస్వాల్‌, గిల్‌, పంత్‌లను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు.

‘‘కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌ భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఇక అద్భుతమైన శతకాలు బాదిన జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌లకు శుభాకాంక్షలు. రిషభ్‌ పంత్‌ కూడా వీరితో సమానంగా తన వంతు పని పూర్తి చేశాడు.

ఈరోజు టీమిండియా బ్యాటింగ్‌ను చూస్తుంటే.. నాకు 2002లో హెడింగ్లీలో.. రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, నేను తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదడం గుర్తుకువచ్చింది. ఆ టెస్టులో మేము గెలిచాము.

ఈరోజు.. యశస్వి, శుబ్‌మన్‌ తమ పని పూర్తి చేశారు. ఇక మూడో సెంచూరియన్‌ ఎవరు అవుతారో చూడాలి’’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పందిస్తూ.. ‘‘హాయ్‌ చాంప్‌.. ఈసారి నలుగురు సెంచరీలు చేస్తారేమో.. పిచ్‌ బాగుంది.. పంత్‌.. కరుణ్‌ కూడా శతకాలు బాదుతారేమో!

అయితే, 2002 నాడు తొలి రోజు పిచ్‌ స్వభావానికి ఇప్పటి వికెట్‌కు కాస్త తేడా ఉంది’’ అని బదులిచ్చాడు. కాగా 2002లో ఇదే వేదికపై సచిన్‌ టెండుల్కర్‌ గంగూలీతో కలిసి 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక టెండుల్కర్‌ 303 బంతుల్లో 193 పరుగులు సాధించగా.. గంగూలీ 128 రన్స్‌ స్కోరు చేశాడు. అదే విధంగా.. ‘వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌ 148 పరుగులు చేయగా.. అప్పటి ఓపెనర్‌ సంజయ్‌ బంగర్‌ 68 రన్స్‌ రాబట్టాడు.

కాగా ఇప్పటి వరకు ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. తాజాగా దీనికి టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇక దఫా పర్యటనలో భారత్‌ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. 

దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, స్పిన్‌ లెజెండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే. రోహిత్‌ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌కు ఈ సిరీస్‌ ప్రతిష్టాత్మక​ంగా మారింది.

 

చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement