నాకు అది అలవాటు.. నువ్వే గుర్తు చేయాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. | Yashasi Jaiswal Requests Shubman Gill To Warn Him Mid Match, Know Reason Inside | Sakshi
Sakshi News home page

నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..

Jun 21 2025 10:28 AM | Updated on Jun 21 2025 12:01 PM

Meri Aadat Hai: Jaiswal Requests Gill To Warn Him Mid Match Reason Is

వయసు జస్ట్‌ 23 ఏళ్లు.. అయితేనేం.. టీమిండియా ఓపెనర్‌గా అతడు కనబరిచే పరిణితి మాత్రం అమోఘం.. టెస్టుల్లో ఇప్పటికే నాలుగు సెంచరీలు.. రెండు ద్విశతకాలు.. తాజాగా ఇంగ్లండ్‌ గడ్డ మీద ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదాడు అతడు.. అంతేకాదు ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఓపెనర్‌గా నిలిచాడు..  అవును.. యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswak) గురించే ఈ ఉపోద్ఘాతం.

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ (India vs England)తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో జైసూ శతక్కొట్టాడు. ఆది నుంచే  పలుమార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఎట్టకేలకు వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 

మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. మూడో వికెట్‌కు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి 129 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ అందించాడు.

తొందరపడితే నన్ను వారించు..
అయితే, గిల్‌తో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్న సందర్భంగా జైసూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తొందరపడితే తనను వారించాలంటూ జైసూ కెప్టెన్‌కు చెప్పడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. భారత్‌ ఇన్నింగ్స్‌లో 38 వ ఓవర్‌లో క్రిస్‌ వోక్స్‌ బంతితో రంగంలోకి దిగాడు.

అతడి బౌలింగ్‌లో తొలి బంతికి బౌండరీ బాదిన జైస్వాల్‌.. తదుపరి బాల్‌కు సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. షాట్‌ బాదగానే వెంటనే పరుగు కోసం వెళ్లాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న గిల్‌ మాత్రం రన్‌కు నిరాకరించాడు. 

దీంతో కాస్త అసహనానికి గురైనప్పటికి... ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న జైస్వాల్‌ వెంటనే క్రీజులోకి పరిగెత్తాడు. తద్వారా ఇంగ్లండ్‌కు రనౌట్‌ చేసే అవకాశం చేజారింది.

నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!
ఈ ఘటన తర్వాత జైస్వాల్‌ గిల్‌తో.. ‘‘రిస్కీ సింగిల్స్‌ వద్దని నాకు చెబుతూనే ఉండండి ప్లీజ్‌.. బంతిని బాదగానే వెంటనే పరిగెత్తడం నాకు అలవాటై పోయింది’’ అని పేర్కొన్నాడు. కాగా జైసూ బాదిన బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. ఈ విషయాన్ని గమనించని జైసూ పరుగుకు రాగా.. ‘‘లేదు లేదు బంతి ఇక్కడే ఉంది’’ అంటూ గిల్‌ చెప్పాడు. గిల్‌ నో చెప్పిన కారణంగా ఇద్దరూ రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

కాగా అప్పటికి జైస్వాల్‌ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ఆ తర్వాత గిల్‌తో కలిసి చక్కటి సమన్వయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 159 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 101 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 127 పరుగులతో.. రిషభ్‌ పంత్‌ 102 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: ద‌క్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్‌.. ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement