భారత్‌ హెచ్చరించినా పట్టించుకోని పాక్‌.. పీఓకేలో దాయాది దుశ్చర్య! | Pakistan Rebuilds 15 Camps In 90 Days After Indian Army Operation Sindoor, More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌ హెచ్చరించినా వినని పాక్‌.. పీఓకేలో దాయాది దుశ్చర్య!

Aug 5 2025 7:36 AM | Updated on Aug 5 2025 9:44 AM

Pak rebuilds 15 camps in 90 days after Op Sindoor

90 రోజుల్లో పీవోకేలో 15కి పైగా ఉగ్రవాద శిబిరాలు, లాంచ్‌ ప్యాడ్‌ల ఏర్పాటు

ఉగ్రవాద శిబిరాల పునర్నిర్మాణానికి పాక్‌ సాయం 

న్యూఢిల్లీ: ఓవైపు భారత దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ మద్దతు కొనసాగిస్తోంది. ఇటీవల భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంలో ప్రధాన ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌ చురుకుగా సహాయం చేస్తోంది. గత 90 రోజుల్లోనే, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) అంతటా 15కి పైగా ఉగ్రవాద శిబిరాలు, లాంచ్‌ప్యాడ్‌లు ఏర్పాటయ్యాయి.

పాకిస్తాన్‌ ఇంటర్‌–సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ), ఇతర ప్రభుత్వ సంస్థల సహాయంతో ఈ శిబిరాలను పునర్నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవి భారత దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపడమే కాకుండా, ఇప్పుడు వారి నెట్‌వర్క్‌లను పునరుద్ధరించేందుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి. కెల్, షార్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా వ్యాలీ, తండపాణి, నయ్యాలి, జాంకోట్, చకోఠి వంటి కీలక ప్రదేశాలలో శిబిరాలను పునర్నిర్మిస్తున్నారు. అదనంగా, జమ్మూ ప్రాంతంలోని మస్రూర్, చాప్రార్‌ వెంట అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నాలుగు లాంచ్‌ప్యాడ్‌లు, షకర్‌గఢ్‌లోని డ్రోన్‌ సెంటర్‌ కూడా పునరుద్ధరిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.  

చిన్న శిబిరాల ఏర్పాటు..  
భారత దళాల దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న ఈ ఉగ్రవాదులు ఇప్పుడు నిఘా నుంచి తప్పించుకోవడానికి, ఉగ్రవాద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కొత్త పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని భారత్‌ ప్రకటిస్తుండటంతో భద్రతా బలగాల నుంచి మరిన్ని దాడులు జరుగుతాయని ఉగ్రవాదులు భయపడుతున్నారు. భారీ ప్రాణనష్టాన్ని నివారించడానికి, ఉగ్రవాదులు ఇప్పుడు ఒక శిబిరంలో దాదాపు రెండు డజన్ల మంది ఉగ్రవాదులకు వసతి కల్పించే చిన్న శిబిరాలను నిర్మిస్తున్నారు. గతంలో ఒకే శిబిరంలో ఈ సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉండేది.

అధునాతన సాధనాలతో పునరుద్ధరణ.. 
ఉగ్రవాదుల కదలికల సరళి కూడా మారిందని వర్గాలు చెబుతున్నాయి. వారు ఇప్పుడు కవచాలుగా ఉపయోగించుకునేందుకు తమ శిబిరాల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలను చేర్చుకుంటున్నారు. డ్రోన్లు, నిఘా పరికరాల వాడకంతో శిక్షణ సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందింది. ఈ శిబిరాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. రాడార్‌ను మభ్యపెట్టడం, ఉపగ్రహ మాస్కింగ్, ఇతర అధునాతన సాధనాలను ఆయా శిబిరాల్లో ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. నిఘా వర్గాల అంచనాల ప్రకారం, ఈ పునర్నిర్మాణానికి ఐఎస్‌ఐ 100 కోట్లకు పైగా పాకిస్తాన్‌ రూపాయలను కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement