‘‘మిత్రదేశాల్ని అప్పులు అడగాలంటే సిగ్గనిపిస్తోంది. అయినా తప్పడం లేదు. నేను, మన ఆర్మీ చీఫ్ ఇద్దరం జోలె పట్టుకుని వీలైనన్నీ ఎక్కువ దేశాలు తిరిగాం. ఇంకా తిరగడానికి కూడా వెనకాడబోం’’ అంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మొన్నీమధ్యే బహిరంగంగా ఒక ప్రకటన చేయడం చూశాం. ఈ క్రమంలో సొంత దేశ పౌరులు తమ గురించి ఏం అనుకున్నా దులిపేసుకుంటాం అనే చందాన ఆయన మాట్లాడారు. ఈ లిస్ట్లో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేరారు.
అంతర్జాతీయ సమాజంలో పాక్ తన పరువు తానే తీసుకుంటోంది. మొన్నీమధ్యే అప్పుల గురించి ఆ దేశ ప్రధాని మాట్లాడిన విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత ఆయన్ని పాక్ పౌరులు నెట్టింట తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వంతు వచ్చింది. జాతీయ అసెంబ్లీలో ఆయన.. బలూచ్ రెబల్స్ను ఎదుర్కోవడం తమ వల్ల కాదనే రీతిలో మాట్లాడడం గమనార్హం.
బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోనే అతిపెద్ద రీజియన్. ఇలాంటి చోట.. తక్కువ సంఖ్యలో దాగి ఉన్న బలూచ్ రెబల్స్ను ఎదుర్కోవడం మన(పాక్) సైన్యానికి పెద్ద సవాల్గా మారింది. పైగా బలూచ్ రెబల్స్ వద్ద ఆధునిక ఆయుధాలు ఉంటున్నాయి. రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు, థర్మల్ వెపన్ సైట్స్.. ఇలాంటివెన్నో వాళ్లు వాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ కూడా ఎక్కువే. పాక్ సైన్యం కూడా మునుపెన్నడూ అలాంటి ఆయుధాల్ని చూసి ఉండదు.. అంటూ ప్రసంగించారాయన. ఈ క్రమంలో అమెరికానే వాటిని సమకూర్చి ఉంటుందని సంచలన ఆరోపణలకు దిగారు.
‘‘ఆ అత్యాధునిక ఆయుధాలు అమెరికన్వే. రెబల్స్ నాయకత్వం ఆఫ్గనిస్తాన్లో ఉండి.. అక్కడి నుంచి మద్దతు పొందుతున్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడం.. రెబల్స్ ఆధునిక సాంకేతికత వాడటం వల్ల మన (పాక్) భద్రతా దళాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. బీఎల్ఏ లాంటి గ్రూపులు క్రిమినల్ గ్యాంగ్స్తో కలసి పనిచేస్తూ, ఆయిల్ స్మగ్లింగ్ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయి. సాధారణ పౌరులను, మహిళలను, పిల్లలను చంపే అలాంటి గ్రూపులతో పాక్ ప్రభుత్వం ఏనాడూ చర్చు జరపబోదు అని ఖ్వాజా జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేశారు.
సాధారణంగా ఒక దేశం తన భద్రతా లోపాలను, సైన్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బహిరంగంగా ఒప్పుకోవడం.. అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిష్టను దెబ్బతీసుకోవడమే. ఇప్పుడు రక్షణ మంత్రి ఖ్వాజా అదే పని చేశారని అక్కడి జనం తిట్టుకుంటున్నారు. సంపాదించేవారని ఆరోపించారు.
ఇటీవల కాలంలో బలూచిస్తాన్లో బలూచిస్తాన్లో రెబల్స్ తిరుగుబాటు మళ్లీ తీవ్రరూపం దాల్చింది. పాక్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని రెబల్స్ వైవిధ్యమైన దాడులకు తెగపడుతున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూలేని రీతిలో మహిళలతో పాక్ ఆర్మీపై బలూచ్ రెబల్స్ గ్రూపులు ఆత్మాహుతి దాడులు జరుపుతున్నాయి. గతవారం ఏకకాలంలో 12 చోట్ల దాడులు జరిపి 80 మంది ప్రాణాలు తీశాయి. అదే సమయంలో పాక్ ఆర్మీ ప్రతిఘటనతో.. ఇరువైపులా భారీగానే ప్రాణ నష్టం సంభవిస్తోంది. అయితే..
కిందటి ఏడాది.. బలూచిస్తాన్లో ప్రయాణికులతో వెళ్తున్న రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత అమెరికా ఆ గ్రూప్ను ఉగ్రసంస్థగా గుర్తిస్తూ.. ఆ రీజియన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా(KBK ప్రాంతాలను "Level 4: Do Not Travel" జాబితాలో చేర్చింది. అంటే అటువైపు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరమైనవని చెప్పడమన్నమాట. ఒక్క బీఎల్ఏ మాత్రమే కాదు.. అక్కడి రెబల్స్ గ్రూపుల్లో చాలావాటిని అమెరికా ఉగ్రసంస్థగా ఈపాటికే గుర్తించింది కూడా. ఈ తరుణంలో.. అమెరికన్ అత్యాధునిక ఆయుధాలనే బలూచ్ రెబల్స్ ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశంగా కనిపించడమే కాదు.. అంతర్జాతీయంగానూ పాక్కు ఇబ్బందులు కలిగించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


