IND VS ENG 1st Test: సెహ్వాగ్‌ సరసన రాహుల్‌.. గవాస్కర్‌ ఒక్కడే మిగిలాడు..! | IND VS ENG 1st Test Day 4: KL Rahul Joins Sehwag, Only Behind Sunil Gavaskar After Fantastic Fifty In Second Innings | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test: సెహ్వాగ్‌ సరసన రాహుల్‌.. గవాస్కర్‌ ఒక్కడే మిగిలాడు..!

Jun 23 2025 6:18 PM | Updated on Jun 23 2025 7:09 PM

IND VS ENG 1st Test Day 4: KL Rahul Joins Sehwag, Only Behind Sunil Gavaskar After Fantastic Fifty In Second Innings

లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 47 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్‌.. 87 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. రాహుల్‌కు కెరీర్‌లో ఇది 18వ హాఫ్‌ సెంచరీ. 

SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) ఓపెనర్‌గా అతనికిది తొమ్మిదో హాఫ్‌ సెంచరీ. ఈ హాఫ్‌ సెంచరీతో రాహుల్‌ భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, మరో మాజీ ఓపెనర్‌ మురళీ విజయ్‌ రికార్డును సమం చేశాడు. భారత ఓపెనర్లుగా సెహ్వాగ్‌, మురళీ కూడా సేనా దేశాల్లో తలో 9 హాఫ్‌ సెంచరీలు చేశారు. ఈ విభాగంలో సునీల్‌ గవాస్కర్‌ ఒక్కడే ప్రస్తుతం రాహుల్‌ కంటే ముందున్నాడు. భారత ఓపెనర్‌గా గవాస్కర్‌ సేనా దేశాల్లో 19 హాఫ్‌ సెంచరీలు చేశాడు.

సేనా దేశాల్లో అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు చేసిన భారత ఓపెనర్లు:

19 - సునీల్ గవాస్కర్ 57 ఇన్నింగ్స్‌లలో
9* - కేఎల్ రాహుల్ 42 ఇన్నింగ్స్‌లలో
9 - మురళీ విజయ్ 42 ఇన్నింగ్స్‌లలో
9 - వీరేంద్ర సెహ్వాగ్ 49 ఇన్నింగ్స్‌లలో

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ​ తగిలింది. తొలి ఓవర్‌ చివరి బంతికే (24.6వ ఓవర్‌) బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.

ఈ దశలో రిషబ్‌ పంత్‌ రాహుల్‌కు జత కలిశాడు. వీరిద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. లంచ్‌ విరామం సమయానికి భారత్‌ స్కోర్‌ 153/3గా ఉంది. రాహుల్‌ 72, పంత్‌ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్‌ ఆధిక్యం 159 పరుగులుగా ఉంది. 

భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (4) విఫలం కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (30) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 2, స్టోక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు భారత్‌, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్‌ చేశాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్‌ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్‌ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్‌ 40, క్రిస్ వోక్స్‌ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. 

ఫలితంగా ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement