ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం తర్వాత, పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ సమరంలో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడినా, 16.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెర్క్సెన్ (52) మెరుపు అర్ద సెంచరీతో, నదినే డి క్లెర్క్ (37) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో సౌతాఫ్రికాను గెలిపించారు.
తొలుత బ్యాట్తో (55 నాటౌట్) సత్తా చాటిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా, ఆతర్వాత బంతితోనూ (2.5-0-16-3) చెలరేగి సౌతాఫ్రికా శిబిరంలో గుబులు రేపింది. సనాకు సదియా ఇక్బాల్ (4-0-26-2), తుబా హస్సన్ (4-0-28-2), నష్రా సంధు (4-0-28-1) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ దశలో ఓటమి దిశగా సాగింది. అయితే అప్పటికే డెర్క్సెన్, క్లెర్క్ గెలుపుకు పునాది వేయడంతో సౌతాఫ్రికా విజయతీరాలకు చేరగలిగింది.
అంతకుముందు 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ను ఫాతిమా సనా (38 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), తుబా హస్సన్ (23) ఆదుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 71 పరుగులు జోడించడంతో పాక్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.
పాక్ ఇన్నింగ్స్లో సనా, తుబాతో పాటు ఇరామ్ జావెద్ (11), ఆలియా రియాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్ 3, షబ్నిమ్ ఇస్మాయిల్, ఖాకా తలో వికెట్ తీశారు.


