భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం దగ్గరపడుతోంది. ఇందులో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి కీలకమైన డబ్ల్యూటీసీ పాయింట్లు సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియాపై శ్రీలంక బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి భారత జట్టు పటిష్టంగా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ను సైతం వాస్ పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా ఈ సిరీస్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతోంది.
"రోహిత్, విరాట్ లేకపోయినా భారత జట్టు ఏ మాత్రం బలహీనపడలేదు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రూపంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు,ఎంతోమంది యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ గిల్ గురుంచి ఎంత పొగిడినా తక్కువే. అతడొక అద్భుతం. గిల్కు అత్యుత్తమ బ్యాటింగ్ స్కిల్స్తో పాటు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి.
ఎంతటి ఒత్తిడిలోనైనా చాలా ప్రశాంతంగా ఉంటాడు. టెస్ట్ క్రికెట్లో కచ్చితంగా ఒక లెజెండ్ అవుతాడు. గాలేలో జరగనున్న తొలి టెస్ట్లో మా జట్టుకు కచ్చితంగా అతడి నుంచి ముప్పు పొంచి ఉంది. శుబ్మన్ క్రీజులో సెటిల్ అయ్యాక అవుట్ చేయడం చాలా కష్టం. మా బౌలర్లు అతడిని ఎలా అడ్డుకుంటారో చూడాలి మరి" అని వాస్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: గంభీర్తో శ్రీలంక మైండ్ గేమ్స్.. ఏమి జరిగిందంటే?


