ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. గ్రూప్ దశలో పాక్కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో ఆ జట్టు తదుపరి రౌండ్కు చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి.
మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట గెలిచి సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకుంది. గ్రూప్-ఏలో బంగ్లా, పాక్తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా.. పాక్, నెదర్లాండ్స్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. సౌథాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్ (39 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది.
వీరు మినహా మరే ఇతర బంగ్లా బ్యాటర్ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. పాక్ బౌలర్లు తొలి 16 ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, చివరి 4 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకొని మూల్యం చెల్లించుకున్నారు. షోర్నా అక్తెర్ చివర్లో పాక్ బౌలర్ల భరతం పట్టింది.
ముఖ్యంగా తస్మియా రుబాబ్ బౌలింగ్ను చీల్చిచెండాడింది. రుబాబ్ మినహా పాక్ బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ ఫాతిమా సనా (4-1-18-2), నష్రా సంధు (4-0-14-1), సదియా ఇక్బాల్ (4-0-21-1) అద్బుతమైన గణాంకాలు నమోదు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) తొలి వికెట్కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్ 26 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది.
షంజిద అక్తెర్ (4-0-21-3), నహిద అక్తెర్ (4-0-18-3), రబేయా ఖాన్ (4-1-17-1), మరుఫా అక్తెర్ (4-1-18-0), రితూ మోనీ (4-0-24-1) ధాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు మినహా ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు.


